Amritpal Singh: విదేశాలకు పాకిన అమృత్పాల్ సింగ్ వ్యవహారం.. అమెరికాలో భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై విదేశాల్లోనూ ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసనకు దిగుతున్నారు. లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను ఖలిస్తాన్ మద్దతుదారులు తొలగించారు. అలాగే అమెరికాలోనూ దాడులు చేశారు.

Amritpal Singh: ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు విదేశాలకూ పాకింది. అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేయొద్దంటూ పంజాబ్లోని అతడి మద్దతుదారులు కొందరు ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా అతడిని అరెస్టు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై విదేశాల్లోనూ ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసనకు దిగుతున్నారు. లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను ఖలిస్తాన్ మద్దతుదారులు తొలగించారు. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం ఢిల్లీలోని బ్రిటన్ రాయబారికి నోటీసులు జారీ చేసింది. తాజాగా అమెరికాలోనూ దాడులు చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఖలిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. సెక్యూరిటీ బారికేడ్లు దాటి మరీ దుండగులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. అక్కడి భారతీయ జెండాల్ని తొలగించారు.
తలుపులు, అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో ఖలిస్తాన్ మద్దతుదారులు అక్కడి పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకు దిగారు. కాగా, ఈ ఘటనలపై భారత్ విచారం వ్యక్తం చేసింది. అలాగే ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయస్పోరా స్టడీస్’ అనే సంస్థ కూడా స్పందించింది. భద్రతా వైఫల్యం వల్లే లండన్, అమెరికాల్లో ఈ ఘటనలు జరిగాయని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనపై శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.