Chenab Rail Bridge : ప్ర‌పంచంలోనే అతి ఎత్త‌యిన రైల్వే బ్రిడ్జ్‌.. కీలక ఘట్టం పూర్తి

ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన దేశంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జ‌మ్ముక‌శ్మీర్‌లో చీనాబ్ న‌దిపై 359 మీట‌ర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ బ్రిడ్జి కీల‌క‌మైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది.

Chenab Rail Bridge : ప్ర‌పంచంలోనే అతి ఎత్త‌యిన రైల్వే బ్రిడ్జ్‌.. కీలక ఘట్టం పూర్తి

Chenab Rail Bridge

Chenab Rail Bridge : ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన దేశంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జ‌మ్ముక‌శ్మీర్‌లో చీనాబ్ న‌దిపై 359 మీట‌ర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ బ్రిడ్జి కీల‌క‌మైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. దీన్ని మైలురాయిగా నార్త‌ర్న్ రైల్వేస్ అభివ‌ర్ణించింది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడువు 1.3 కిలోమీట‌ర్లు కాగా.. రూ.1,486 కోట్ల ఖ‌ర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. ఉధ‌మ్‌పూర్‌-శ్రీన‌గ‌ర్‌-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ అతి ఎత్త‌యిన బ్రిడ్జ్‌ను నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. ఇది ప్యారిస్‌లోని ఈఫిల్ ట‌వ‌ర్ కంటే కూడా 35 మీట‌ర్ల ఎత్తు ఎక్కువ ఉండ‌టం విశేషం.

క‌శ్మీర్‌ను మిగిలిన దేశంలో అనుసంధానించడంలో భాగంగా చేప‌ట్టిన యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్ట్‌లో సోమ‌వారం(ఏప్రిల్ 5,2021) ఓ చారిత్ర‌క మైలురాయిని నార్త‌ర్న్ రైల్వేస్ పూర్తి చేసింది. ప్రాజెక్ట్ మొత్తం రెండున్న‌రేళ్ల‌లో పూర్తవుతుందని నార్త‌ర్న్ రైల్వేస్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అశుతోష్ గంగాల్ తెలిపారు. ఈ బ్రిడ్జ్ ఆర్క్ నిర్మాణం పూర్తయ్యే ఘ‌ట్టాన్ని వీడియో లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ చూశారు. రెండు భాగాలుగా ఉన్న ఆర్క్‌ను క‌లిపే 5.6 మీట‌ర్ల లోహాన్ని సోమ‌వారం క‌లిపి మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసిన‌ట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మొత్తం 28వేల 660 మెట్రిక్ ట‌న్నుల స్టీలు, 66 వేల క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీటును వాడిన‌ట్లు అశుతోష్ చెప్పారు.