Chinese Fighter Jets : సరిహద్దుల్లో చైనా యుద్ధ విమానాల విన్యాసాలు

తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి ఏడాది దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు.

Chinese Fighter Jets : సరిహద్దుల్లో చైనా యుద్ధ విమానాల విన్యాసాలు

Chinese Fighter Jets

Chinese Fighter Jets తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి ఏడాది దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు. సరిహద్దులో చైనా మళ్లీ కార్యకలాపాలను పెంచుతోంది. తాజాగా తూర్పు లడఖ్ కి సమీపంలోని చైనా ఎయిర్​బేస్ వద్ద 20కి పైగా యుద్ధవిమానాలతో చైనా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహించినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే,చైనా యుద్ధవిమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విన్యాసాలను భారత సైన్యం జాగ్రత్తగా గమనించినట్లు పేర్కొన్నాయి.

భారత భూభాగమైన తూర్పు లడఖ్ కి ఎదురుగా చైనా ఎయిర్ బేస్ వద్ద ఇటీవల దాదాపు 21-22 చైనా యుద్ధవిమానాలు విన్యాసాలు నిర్వహించాయి. వీటిలో ప్రధానంగా జే-11, జే-16 యుద్ధ విమానాలు ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల ఫైటర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు వీలుగా ఇటీవల అప్ గ్రేడ్ చేయబడిన హోటన్, గర్ గన్సా, కష్గర్​ ఎయిర్​బేస్​లలో చైనా వాయిసేన విన్యాసాలను నిర్వహించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్​బేస్​లో ఎన్ని ఫైటర్ జెట్లు ఉన్నాయో తెలిసే అవకాశం లేకుండా చైనా ఏర్పాట్లు చేసుకున్నట్లు వివరించాయి. ఈ విన్యాసాలను భారత సైన్యం జాగ్రత్తగా గమనించినట్లు పేర్కొన్నాయి. ఇక, బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పాంగాంగ్ సరస్సు వంటి ప్రాంతాల నుంచి చైనా తమ సైనికులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ, హెచ్​క్యూ-9, హెచ్​క్యూ-16 వంటి వాయు రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచిందని అధికార వర్గాలు చెప్పాయి.

ఇక, గతేడాది గల్వాన్​ లోయలో చైనా సైనికులతో ఘర్షణ జరిగిన తర్వాత సరిహద్దులో యుద్ధ విమాన కార్యకలాపాలను భారత్ పెంచింది. డ్రాగన్​కు దీటుగా భారత్ కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది.సైన్యంలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధవిమానాలతో గస్తీ పెంచి భారత్ శక్తి సామర్థ్యాలేంటో డ్రాగన్ దేశానికి చాటి చెప్పింది.

మరోవైపు,తూర్పు లడఖ్ లో ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న 90శాతం మంది తమ సైనికులను చైనా వెనక్కు రప్పించి వారి స్థానంలో కొత్త వారిని అక్కడికి పంపించినట్లు సమాచారం. లడఖ్ లోని కఠిన వాతావరణ ప్రభావం చైనా సైనికులపై పడిందని, వారిలో అనేక మంది తీవ్రమైన గాయాలైన విషయాన్ని భారత సైన్యం గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.