భగవద్ఘీత నేర్పే నా తండ్రి ఉగ్రవాదా? అలా అనటానికి మీకు నోరెలా వచ్చింది : కేజ్రీవాల్ కుమార్తె ఫైర్

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 04:52 AM IST
భగవద్ఘీత నేర్పే నా తండ్రి ఉగ్రవాదా? అలా అనటానికి మీకు నోరెలా వచ్చింది : కేజ్రీవాల్ కుమార్తె ఫైర్

బీజేపీ నేతలపై సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షిత మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో  అర్వింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై హర్షిత విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. మా నాన్న కేజ్రీవాల్ నన్నూ, నా సోదరుడిని తెల్లవారుజామున నిద్ర లేపి భగవద్గీత చదవి వినిపించేవారు…ఇలా భగవద్గీత నేర్పిన నా తండ్రి ఉగ్రవాదా? అంటూ హర్షిత ప్రశ్నించారు.

సామాజిక సేవలు చేసే ఆయన్ని ఉగ్రవాది అనటానికి మీకు నోరెలా వచ్చింది? పేద ప్రజలకు ఉచితంగా వైద్యసౌకర్యాలు కల్పించడం, పిల్లలను విద్యావంతులను చేయడం, విద్యుత్, మంచినీటి సరఫరాను మెరుగుపర్చిన నా తండ్రి ఉగ్రవాదా? అని హర్షిత బీజేపీ నేతలను ఆగ్రహంతో ప్రశ్నించారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడం కూడా ఉగ్రవాదమా?  అని హర్షిత కేజ్రీవాల్ ప్రశ్నించారు. 

బీజేపీ ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం (ఫిబ్రవరి 4,2020)న మాట్లాడుతూ కేజ్రీవాల్‌ ఒక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ వంటి వారు సమాజానికి ప్రమాదమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమాయకమైన ముఖంతో కేజ్రీవాల్ ప్రజలను మోసం  చేస్తున్నారనీ..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  ఉగ్రవాది అని నిరూపించేందుకు పలు ఆధారాలున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.

కాగా..ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి.