భారత్ కు అమెరికా వార్నింగ్
US warns India:బగత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ సర్కార్ భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని ఇండియాతోపాటు ఇతర దేశాలను హెచ్చరించింది.
అదేవిధంగా, రష్యా నుంచి S400 ట్రింఫ్ యాటీ మిసైల్ సిస్టమ్ ని కొనుగోలు చేసిన టర్కీపై ఆంక్షలు విధించింది. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ (CAATSA) కింద టర్కీకి చెందిన మిలిటరీ ఆయుధాల సేకరణ సంస్థ SSB, నలుగురు టర్కిష్ అధికారులపై ఆంక్షలుపై పలు ఆంక్షలు విధించినట్లు ఇంటర్నేషల్ సెక్యూరిటీ మరియు నాన్ ప్రోలిఫరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ ఫోర్డ్ సోమవారం ప్రకటించారు.
ఈ విషయాన్ని అన్ని దేశాలు గుర్తించి రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపేయాలని, లేదంటే CAATSA సెక్షన్ 231 కింద అమెరికా విధించే ఆంక్షలను ఎదుర్కోక తప్పదని ఫోర్డ్ హెచ్చరించారు. అయితే, ఈ CAATSA చట్టాన్ని పలువురు డెమొక్రాట్లు కూడా మద్దతిస్తుండటంతో జో బైడన్ హయాంలోనూ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు.
కాగా, 2018లో భారత ప్రభుత్వం… ఐదు S400 యాంటీ మిస్సైల్ వ్యవస్థల కోసం రష్యాతో 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ను అమెరికా వ్యతిరేకిస్తున్నా.. ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నా.. భారత ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరోవైపు అమెరికా కూడా భారత్ కు ఆయుధాలను విక్రయిస్తూనే ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో భారత పర్యటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 3.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 24 సికోర్క్సీ ఎంహెచ్-60ఆర్ సీ హాక్ హెలికాప్టర్లు, ఆరు బోయింగ్ ఏహెచ్-64ఈ అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్లను భారత్కు అమెరికా విక్రయించనుంది.