Assam : పుట్టగొడుగులు తిని ఇద్దరు చిన్నారులతో సహా 13 మంది మృతి
అస్సాంలో పుట్టగొడుగులు తిని ఇద్దరు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు. వీరంతా టీ తోటల్లో పనిచేసే కార్మికులే.
Assam poisonous mushroom..13 died : అసోంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పుట్టగొడుగులు తిన్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. విషపూరితమైన పుట్టగొడుగులు తిని 13మంది మృతి చెందగా..మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మృత్యువాత పడ్డ వారంతా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు. అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అధికారులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వీరిలోని కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అస్సాంలోని చరైడియో, దిబ్రూగర్, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాలకు చెందిన టీ గార్డెన్ కార్మికులు టీ తోటల్లో పని ముగించుకుని వస్తుండగా దారిలో కనిపించిన పుట్టగొడుగులను ఇంటికి తెచ్చుకున్నారు. వాటిని కూర వండి తిన్నారు. ఆహారం తిన్న కాసేపటికే వీరంతా కడుపు నొప్పితో వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి మరింతగా క్షీణించటంతో దిబ్రూఘర్లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (AMCH)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతు 13మంది చనిపోయారు.
మిగిలివారిని కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ (AMCH) సూపరింటెండెంట్ ప్రశాంత డిహింగియా బుధవారం (ఏప్రిల్ 13,2022) తెలిపారు. కాగా..పుట్టగొడుగులను తిన్న తర్వాత అస్వస్థతకు గురై గత ఐదు రోజుల్లో AMCHలో చేరారు. చేరిన 35 మందిలో గత 24 గంటల్లో 13 మంది చనిపోయారు.