Covid-19 : మరోసారి కోవిడ్ నిబంధనలు-నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు
కరోనా థర్డ్వేవ్ వస్తుందనే వార్తల నేపధ్యంలో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
Covid-19 : కరోనా థర్డ్వేవ్ వస్తుందనే వార్తల నేపధ్యంలో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
గత వారం రోజులుగా 10 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని స్ధానిక అధికారులకు ఆదేశాలిచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కరోనా వ్యాప్తి నివారణకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా…ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.
కాగా అసోం ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు
*రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు
*ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పనిప్రదేశాల్లో యధావిధిగా విధులు నిర్వర్తించుకోవచ్చు. అయితే, రాత్రి ఎనిమిదిగంటలకల్లా కార్యాలయాలు మూసివేయాలి.
*రెస్టారెంట్లు, హోటళ్లు, రిసార్టులు, దాబాలు తదితర ఈటరీలు, షోరూంలు, కోల్డ్ స్టోరేజీలు, వేర్హౌస్లు, నిత్యావసరాలు విక్రయించే షాపులు, మిల్క్ బూతులు సైతం రాత్రి 8 గంటల కల్లా మూసివేయాలి.
*ఒక ద్విచక్ర వాహనం పై ఇద్దరు ప్రయాణించవచ్చు. అయితే, అందులో కనీసం ఒక్కరైనా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలి. ఇద్దరూ కచ్చితంగా మాస్కులు ధరించాలి.
*అంతరాష్ట్ర ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులు, ఇతర వాహనాలు నడుపవచ్చు. అయితే, కచ్చితంగా కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ సింగిల్ డోస్ అయినా వేసుకుని ఉండాలి.
*ఇక పోస్ట్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, హయ్యర్ సెకండరీ ఫైనల్, నర్సింగ్ కోర్సు, ఇతర సాంకేతిక విద్యాసంస్థలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు. అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వ్యాక్సిన్ సింగిల్ డెస్ తీసుకుని ఉండాలి. వీరి కోసం మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలి.
*సింగిల్ డోసు వేసుకున్న వాళ్లు, అత్యధికంగా 50 మంది ఫంక్షన్లలో పాల్గొనవచ్చు. స్థానిక పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే సమావేశాలు నిర్వహించుకోవాలి. ఇక కలెక్టర్ అనుమతితో 200 మంది(వ్యాక్సినేటెడ్ పీపుల్) ఏదేని సమావేశానికి హాజరు కావచ్చు.
*పెళ్లి, అంత్యక్రియల వంటి కార్యాలకు గరిష్టంగా 50 మంది, మతపరమైన, పవిత్ర స్థలాల్లో 40 మంది సమావేశాలకు హాజరు కావచ్చు (వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు మాత్రమే).
* తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సినిమా థియేటర్లు తెరవకూడదు.