అసోం ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థుల్లో సగం మంది కొత్తవారే

అసోం ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థుల్లో సగం మంది కొత్తవారే

Assam polls 126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో జరగనున్న ఎన్నికలు మర్చి-27నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి-27న ఫేజ్-1లో భాగంగా 47అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 47 స్థానాల సంబంధించి 40మంది అభ్యర్థుల జాబితాను శనివారం రాత్రి కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రకటించిన 40 మంది అభ్యర్థుల జాబితాలో 20 మంది కొత్తగా ఎన్నికల్లో పోటీచేసేవారే ఉన్నారు. ఆరుగురు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్​.

ఇక,టీటబోర్ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఆ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన అసోం దివంగత ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయి​ కుటుంబసభ్యులను ఇందుకోసం కాంగ్రెస్ సంప్రదించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీటబోర్​తో పాటు తిన్​సుఖియా, దకువాకానా, బహాలీ, ధింగ్, బోకాఖాత్, నవోబయోచా నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్ 6 తేదీల్లో మూడు దశల్లో అసోం ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో 2001నుంచి 2016 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. గత ఎన్నికల్లో కేవలం 26 సీట్లకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. అయితే ఈ సారి వామపక్షాలు, బోడోలాండ్ పార్టీలతో కలిసి మహా కూటమిగా బరిలోకి దిగుతోంది.