PM Modi : ఆగస్టు-5 చరిత్రలో నిలిచిపోతుంది
ఆగస్టు 5వ తేదీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi ఆగస్టు 5వ తేదీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున ఆర్టికల్ 370 రద్దు,గతేడాది ఇదే రోజున రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన,భారత పురుషుల హకీ టీమ్ జర్మనీపై ఇవాళ(ఆగస్టు-5) విజయం సాధించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ…ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 15 కోట్ల మంది లబ్దిదారులు ఉచితంగా రేషన్ ని పొందుతున్నట్లు తెలిపారు. యూపీలో దాదాపు 80,000 రేషన్ దుకాణాల ద్వారా లబ్దిదారులకు రేషన్ పంపిణీ చేయబడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల్లో పేదలకు అందే ఆహార ధాన్యాలు దోపిడికి గురయ్యాయని మోదీ తెలిపారు. కొన్నేళ్ల క్రితం.. ఉత్తర్ప్రదేశ్ను రాజకీయ కోణంలోనే చూశారని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశాల గురించి ఆలోచించలేదని ఆరోపించారు మోదీ. కానీ, కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధి ఇంజిన్ పుంజుకుందన్నారు. ఇక,కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని, పుకార్లను నమ్మొద్దని ఈ సందర్భంగా మోదీ కోరారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెగసస్ వ్యవహారంపై పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్షాలపై మోదీ విమర్శలు గుప్పించారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హకీ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ…హాకీలో మనోళ్లు గోల్స్ చేస్తుంటే అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని, కానీ కొందరు మాత్రం సెల్ప్ గోల్ చేసుకుంటున్నారని విపక్షాలనుద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి, దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. అలాంటి రాజకీయాలకు, స్వార్థానికి దేశం బందీ కాదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దేశం ముందుకు వెళ్తోంది. నెగటివ్ ప్రజలు దేశ పురోగతిని అడ్డుకోలేరు. 41 ఏండ్ల తర్వాత భారత్ హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. సరికొత్త భారత్ ర్యాంకుల ద్వారా కాకుండా మెడల్స్ సాధించటం వల్ల ప్రపంచ గుర్తింపు పొందుతోంది. అది కుటుంబంతో కాదు, కష్టపడినప్పుడే రుజువుతుంది. భారత యువత అనూహ్య విజయాలతో ముందుకు సాగుతోందని మోదీ అన్నారు.