అయోధ్య రామజన్మభూమిలో రెండో రోజు వైదిక కార్యక్రమాలు

  • Published By: naveen ,Published On : August 4, 2020 / 01:10 PM IST
అయోధ్య రామజన్మభూమిలో రెండో రోజు వైదిక కార్యక్రమాలు

అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన వైదిక, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ(మంగళవారం, ఆగస్టు 4,2020) పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి బుధవారం(ఆగస్టు 5,2020) శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం జరిగే ప్రదేశంలో సోమవారం(ఆగస్టు 3,2020) 12మంది పూజారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి పూజ జరిపారు. అలాగే హనుమాన్‌ గర్హి ఆలయంలో మంగళవారం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. బుధవారంతో ముగుస్తాయి. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రధాని మోడీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.



3 రోజులు వైదిక, పూజా కార్యక్రమాలు:
అయోధ్య రక్షకుడిగా హనుమంతుడిని చూస్తారు. అందుకే రామ మందిరం నిర్మాణానికి ముందు హనుమాన్ గర్హి ఆలయంలో పూజలు చేస్తున్నాం. రామ మందిరం నిర్మాణానికి ఆయన అనుమతి కోరాం అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు. రామ జన్మభూమిలో 21మంది వేద పండితులు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య నుంచి 8మంది పూజారులు వచ్చారు. వారణాసి, ఢిల్లీ నుంచి ఐదుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు వచ్చారు. రామ మందిరం నిర్మాణానికి ముందు వీరంతా రామ జన్మభూమిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వేదికపైకి ఐదుగురికే అనుమతి:
భూమి పూజ కార్యక్రమ వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భాగవత్, ట్రస్ట్‌ చీఫ్‌ నృత్య గోపాలదాస్‌ మహారాజ్, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే ఉంటారు. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఆహ్వానితులు మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి రావాలని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాలు పంపిన 175 మందిలో 135 మంది పలు సంప్రదాయ మఠ, ఆధ్యాత్మిక గురువులేనని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకురాలు ఉమా భారతి.. భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు.



రత్నాలు పొదిగిన దుస్తులు:
భూమి పూజ రోజు ‘రామ్‌లల్లా’కు అలంకరించే వస్త్రాలను శంకర్‌లాల్, భగవత్‌ లాల్‌ సోదరులు రూపొందిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా వారు బాల రాముడికి వస్త్రాలను రూపొందిస్తున్నారు. ‘1985లో మా నాన్న బాబూలాల్‌ బాల రాముడికి వ స్త్రాలు రూపొందించడం ప్రారంభించారు. కుట్టుమిషన్‌తో పాటు రామజన్మభూమికి వెళ్లి, అక్కడే రామ్‌లల్లా విగ్రహం ముందే దుస్తులు కుట్టేవారు. మా ఇద్దరిని కూడా వెంట తీసుకువెళ్లేవారు’ అని శంకర్‌లాల్‌ తెలిపారు. ‘5న రామ్‌లల్లాకు అలంకరించడం కోసం రెండు జతల దుస్తులను రూపొందిస్తున్నాం. మఖ్మల్‌ వస్త్రంతో బంగారు దారంతో నవ రత్నాలు పొదిగి ఒకటి ఆకుపచ్చ వర్ణంలో, మరొకటి నారింజ రంగులో సిద్ధం చేస్తున్నాం’ అని తెలిపారు. కాగా, భూమి పూజ పనులను యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే భూమి పూజకు ముందు ప్రధాని మోడీ ప్రార్థనలు చేస్తారని భావిస్తున్న హనుమాన్ గర్హీ ఆలయాన్ని కూడా సీఎం యోగి పరిశీలించారు. ఇది చారిత్రక రోజు మాత్రమే కాదు, భావోద్వేగమైన క్షణం కూడా. 500 ఏళ్ల తర్వాత రామాలయం పనులు ప్రారంభం అవుతున్నాయి. నవ భారతానికి ఇది నాంది అని యోగి అన్నారు.

అది శ్రీరాముడి కోరిక:
భూమి పూజ కార్యక్రమానికి తాను హాజరుకావడం శ్రీరామ చంద్రుడి కోరిక కావచ్చని అయోధ్య భూ వివాదంలో కక్షిదారు అయిన ఇఖ్బాల్‌ అన్సారీ అన్నారు. ఆలయ ట్రస్ట్‌ నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు. భూమిపూజ రోజున ప్రధాని మోడీకి రాముడి పేరు ఉన్న శాలువాను, రామచరిత మానస్‌ పుస్తకాన్ని బహూకరించాలనుకుంటున్నా అని తెలిపారు.

లక్నోకి 130 కిలోమీటర్ల దూరంలో అయోధ్య నగరం ఉంది. 4వేల మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయోధ్యకు వెళ్లే దారిలో 75 చెక్ పోస్టులు పెట్టారు. సోమవారం(ఆగస్టు 3,2020) రాత్రి నుంచి జిల్లా సరిహద్దులు మూసివేశారు.