ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు…కోర్టుకు బీజేపీ అగ్రనేతలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 16, 2020 / 04:42 PM IST
ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు…కోర్టుకు బీజేపీ అగ్రనేతలు

దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్​కే యాదవ్​ ఆదేశించారు. కేసుకు సంబంధించి ఈ నెల 1న వాదనలు ముగిసిన విషయం తెలిసిందే.


బాబ్రీ కేసులో మొత్తం 32మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో బీజేపీ దిగ్గజ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, కల్యాణ్​ సింగ్​ తదితరులు ఉన్నారు. కేసు విచారణ సందర్భంగా.. మొత్తం 351మంది సాక్ష్యులను కోర్టు ఎదుట హాజరుపరిచింది సీబీఐ. 600లకుపైగా ఆధారాలను డాక్యుమెంటరీ రూపంలో కోర్టుకు సమర్పించింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో సెప్టెంబర్-30న ఈ కేసులో తీర్పు వెలువడనుంది.


బీజేపీ నేతలపై ఆరోపణలు..స్టేట్‌మెంట్‌ రికార్డు

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి దారితీసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ దిగ్గజ నేతలపై ఆరోపణలున్నాయి. రాముడి జన్మస్థలంలో మసీదు ఉందని నమ్మడంతో కరసేవకులు ఈ కట్టడాన్ని నేలమట్టం చేశారు. బాబ్రీ కూల్చివేతపై అద్వానీ.. జులై 24న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్దానం ఎదుట స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అంతకుముందు రోజు మురళీ మనోహర్‌ జోషీ తన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. తమపై నమోదైన అన్ని అభియోగాలను వారు తోసిపుచ్చారు. ఇక బాబ్రీ కేసులో న్యాయస్ధానం ఎలాంటి తీర్పు వెలువరించినా ఇబ్బంది లేదని బీజేపీ సీనియర్‌ నేత ఉమా భారతి తెలిపారు
https://10tv.in/sc-shocked-to-hear-oldest-pending-criminal-case-against-mps-mlas-is-from-1983/