నందిగ్రామ్ లో మమత ఓటమి ఖాయం..దీదీ ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారా?
మమతా బెనర్జీని తప్పనిసరిగా గద్దె దించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Bengal మమతా బెనర్జీని తప్పనిసరిగా గద్దె దించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నందిగ్రామ్ ప్రజలు ఆ కలను ఈ రోజు నెరవేర్చుకున్నారని మోడీ చెప్పారు. గురువారం(ఏప్రిల్-1,2021) హౌరా జిల్లాలోని ఉలుబేరియా సిటీలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని..బెంగాల్ ప్రజలు తమ గుర్తింపును, భవిష్యత్ను కాపాడుకునేందుకు ఇంకొంత కాలం ఎదురుచూడాలని అనుకోవడం లేదు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో మాత్రమే పాల్గొనడం లేదు.. బంగాల్ పునరుజ్జీవానికి బాటలు పరుస్తున్నారని మోడీ అన్నారు.
ఈ సందర్భంగా మమతపై విమర్శలు ఎక్కుపెట్టారు మోడీ. కొన్నిసార్లు దీదీ తనని టూరిస్ట్ అని,కొన్నిసార్లు బయటివ్యక్తి అని పిలుస్తోందని,కానీ చొరబాటుదారులను సొంతవారిగా పరిగణించి..భరతమాత పుత్రులను బయటి వ్యక్తులని మమత పిలుస్తోందని మోడీ విమర్శించారు. ప్రజల్ని అవమానించడం మమత ఆపాలన్నారు. దేశ పౌరులపై బయటివారు అనే ముద్ర వేసి రాజ్యాంగాన్ని అవమానించొద్దని మమతకి హితవు పలికారు.
నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన దీదీ.. ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మరో స్థానానికి మమత నామినేషన్ వేయనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత అని అడిగారు. నందిగ్రామ్ ప్రజలు మమతకు తమ సమాధానం ఇచ్చారన్నారు. మమత వేరే చోట నుంచి పోటీకి దిగినా..ఆమెను ఓడించేందుకు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం ఇందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని అన్నారు.