Bharat Bandh: నేడు భారత్ బంద్.. సాయంత్రం 4 వరకు ఎక్కడివక్కడే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేడు (సోమవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు పాల్గొననుండగా..
Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేడు (సోమవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు పాల్గొననుండగా సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పూర్తి సన్నాహాలు చేసినట్టు ప్రకటించింది. కేంద్రం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను దేశమంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కిసాన్ మోర్చా కోరింది.
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి నేటికి (సెప్టెంబర్ 27) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా 40 రైతుల సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వగా.. దీని కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల మద్దతు కోరింది. దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్ కు మద్దతివ్వడంతో భారత్ బంద్ కఠినంగా కనిపించనుంది. ఇప్పటికే బంద్ దృష్ట్యా గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేయగా రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.
సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ జరగనుండగా దీనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ తెలిపగా.. బంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రకటించారు. దక్షణాది నుండి ఏపీ, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా బంద్కు మద్దతు ప్రకటించగా బంద్కు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడెరేషన్ కూడా మద్దతు ప్రకటించింది.