పోలీసులకు మస్కా కొట్టి ఆందోళనలో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్
పోలీసులకు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గట్టి ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నిరసన కారులు శుక్రవారంనాడు జామా మసీదు వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఈ సమయంలో భీమ్ ఆర్మీ చీఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు మస్కా కొట్టిన చంద్రశేఖర్ ఆందోళనలో పాల్గొన్నారు.
జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకూ జరుప తలబెట్టిన ఆందోళన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఈ సమయంలో పోలీసులు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు మస్కా కొట్టి జామా మసీదు మెట్లపై నిరసనకారులతో కలిసి ఆందోళలో పాల్గొన్నాడు చంద్రశేఖర్. చేతిలో రాజ్యాంగం యొక్క కాపీ,అంబేద్కర్ ఫొటోతో ఆయన నినాదాలు చేశారు.
జామా మసీదు వద్ద స్వయంగా ఢిల్లీ పోలీస్ పీఆర్ఓ ఎంఎస్ రాంధ్వా పరిస్థితిని సమీక్షిస్తూ, అక్కడ పెద్దఎత్తున గుమిగూడిన ప్రదర్శనలను శాంతియుతంగా వెనక్కి వెళ్లాలని కోరారు. ప్రజలు ప్రశాంతతను పాటించాలని, ఆందోళనలను విరమించాలని పోలీసు యంత్రాంగం ఇప్పటికే రకరకాల మాధ్యమాల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య ఢిల్లీలో పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంతో పాటు, పలు ప్రాంతాల్లో నిఘా కోసం డ్రోన్లను కూడా రంగంలోకి దింపారు.