Train Assistant Pilot Drinking : ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం.. రైలుని వదిలేసి మద్యం మత్తులో డ్రైవర్
మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణికులను ఉలిక్కిపడేలా చేసింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడాడు.(Train Assistant Pilot Drinking)
Train Assistant Pilot Drinking : టీ తాగాలనిపించి ఒకడు, కచోరి తినాలనిపించి మరొకడు, మందు కోసం ఇంకొకడు.. ఇదీ.. రైలు డ్రైవర్ల (లోకో పైలెట్) తీరు. ప్రయాణికులను సేఫ్ గా వారి గమ్య స్థానాలకు చేర్చాల్సిన రైలు డ్రైవర్లు తమ చేష్టలతో వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణికులను ఉలిక్కిపడేలా చేసింది. డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ప్రయాణం మధ్యలోనే రైలుని వదిలేసిన అతగాడు ఎంచక్కా మద్యం మత్తులో మునిగిపోయాడు. ఓ చోట తప్పతాగి పడిపోయాడు.(Train Assistant Pilot Drinking)
Rajasthan : కచోరి తినాలనిపించి రైలు ఆపేసిన డ్రైవర్..తరువాత ఏమైందంటే..?!
సమస్తిపూర్- సహర్సా లోకల్ రైలు సోమవారం సాయంత్రం సమస్తిపూర్ జంక్షన్ నుంచి సహర్సాకు బయలుదేరింది. దాదాపు గంట తర్వాత రాజధాని ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం హసన్పూర్ స్టేషన్లో ఆగింది. ఇక్కడే అసిస్టెంట్ లోకో పైలట్ కరమ్వీర్ ప్రసాద్ యాదవ్ రైలు దిగాడు. మద్యం కోసం సమీపంలోని ఓ షాక్ కి వెళ్లాడు. అక్కడ మద్యం బాటిల్ తీసుకున్నాడు. ఫుల్లుగా మందేశాడు. తప్పతాగి అక్కడే పడిపోయాడు.
కాగా, ఆ రైలు దాదాపు గంటకుపైగా స్టేషన్లోనే నిలిచిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఆందోళనకు దిగారు. దీంతో స్టేషన్ మాస్టర్ స్పందించారు. అదే రైల్లో ప్రయాణిస్తున్న మరో అసిస్టెంట్ లోకో పైలట్ను విధులు నిర్వహించమని కోరారు.
మరోవైపు రంగంలోకి దిగిన జీఆర్పీ పోలీసులు.. సడెన్ గా కనిపించకుండా పోయిన లోకో పైలెట్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతుండగా.. హసన్పూర్లోని ఓ మార్కెట్లో అసిస్టెంట్ లోకో పైలెట్ ని గుర్తించారు. మద్యం మత్తులో పడి ఉన్న అతడి చూసి అవాక్కయ్యారు. వెంటనే అతడిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాగా, లోకో పైలెట్ కు మద్యం ఎవరు సరఫరా చేశారన్న దానిపై స్పష్టత లేదు. బీహార్లో మద్యపానంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక కోరినట్లు సమస్తిపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ అగర్వాల్ తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత రైల్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, అసలు మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే, బీహార్లో మద్యపానంపై నిషేధం ఉంది.
కాగా, బీహార్ లో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. ఇటీవలే గ్వాలియర్-బరౌనీ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ సైతం టీ తాగేందుకని బీహార్ సివాన్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ దగ్గర ట్రైన్ను నిలిపేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కచోరి తినాలనిపించడంతో రైలు డ్రైవర్ ఏకంగా రైలుని ఆపేశాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన లోకో పైలట్లు.. ఇలా రైలును మార్గమధ్యలోనే వదిలేయడం ఆందోళన కలిగించే అంశం.