ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…బీజేపీ అభ్యర్థి కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : November 22, 2020 / 09:20 PM IST
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…బీజేపీ అభ్యర్థి కన్నుమూత

BJP candidate collapses and dies while campaigning కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ ఓ బీజేపీ అభ్యర్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే కిందపడి మరణించాడు. బాధితుడిని ఎల్లిపరాంబత్ విశ్వనాథన్ గా గుర్తించారు. కొల్లం జిల్లాలో ఈ విషాద ఘటన చోటచేసుకుంది.



స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కేరళలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొల్లం జిల్లాలోని పన్మానా పంచాయతీ పరిధిలోని పరాంపిముక్కు వార్డులో బీజేపీ అభ్యర్థిగా ఎలిపరాంబత్ విశ్వనాథన్(60) పోటీచేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రచారం పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో శనివారం కార్యకర్తలో కలిసి విశ్వనాథన్ ప్రచారంలో పాల్గొన్నారు.



అయితే, ప్రచారంలో భాగంగా శనివారం ఓట‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూనే.. మైక్‌ను వదిలేసి స్టేజిపై కుప్పకూలిపోయారు. అక్కడున్న కార్యకర్తలు ఆయనని లేపే ప్రయత్నం చేసినప్పటికీ ఉలుకూ పలుకూ లేదు. వెంటనే విశ్వనాథన్ ని స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

అయితే,అప్పటికే విశ్వనాథన్ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. విశ్వనాథ్ మృతితో పన్మామా పంచాయతీ పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీజేపీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ పార్టీ అభ్యర్థి మృతి పట్ల బీజేపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.