అతి త్వరలో ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం…నడ్డా కీలక వ్యాఖ్యలు
త్వరలోనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. శనివారం ఒడిశా రాష్ర్ట కార్యనిర్వాహక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన… ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
2014 విధానసభలో బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయని, 2019 లో అది 32 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఓట్లను తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఎగ్జిక్యూటివ్ సహాయకులతో అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో తమకు ఒక కోటి ఓట్లు రావడం సంతోషకరమన్నారు. షెడ్యూల్డ్ తెగలలో, షెడ్యూల్డ్ కులాల్లో ప్రభావాన్ని పెంచుకోవాలన్నారు.
.బీజేపీ కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లి ప్రతిష్టాత్మక నూతన జాతీయ విద్యా విధానం గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేయకపోవడం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు నడ్డా తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకు చేరేందుకు అనుమతించాలని సీఎం నవీన్ పట్నాయక్ను కోరుతున్నట్లు పేర్కొన్నారు. చికిత్స నిమిత్తం ఒడిశా ప్రజలకు ఢిల్లీకి వస్తుంటారు. అటువంటి ఇబ్బందులను తొలగిస్తూ మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజపేయి, ప్రధాని నరేంద్రమోదీ చర్యలు చేపట్టారన్నారు. ఎయిమ్స్ భువనేశ్వర్లోనే ఒడిశా ప్రజలు ఇప్పుడు చికిత్సను పొందవచ్చన్నారు.