బీహార్​ ఎన్నికలు : జేడీయూ, ఎల్​జేపీతో కలిసే బీజేపీ బరిలోకి

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2020 / 03:34 PM IST
బీహార్​ ఎన్నికలు : జేడీయూ, ఎల్​జేపీతో కలిసే బీజేపీ బరిలోకి

రానున్న బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలు జేడీయూ, ఎల్​జేపీతో కలిసే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్​జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తాము ఉమ్మడిగానే బరిలోకి దిగుతామని నడ్డా తెలిపారు. నితీశ్​ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని తేల్చి చెప్పారు.

ఆదివారం బీహార్ రాష్ట్ర బీజేపీ కార్యసమితిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో నడ్డా మాట్లాడారు. కరోనా కట్టడిలో నితీశ్ కుమార్ ప్రభుత్వం పనితీరును నడ్డా ప్రశంసించారు. బిహార్​లో ప్రతిపక్షానికి సిద్ధాంతాలు గానీ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం గానీ లేదని విమర్శించారు నడ్డా. ప్రజలంతా భాజపా వైపే చూస్తున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ సభ్యులకు సూచించారు. బీజేపీలోనే కాదు కూటమి పక్షాల్లోనూ విలువలు జోడించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాజపా, జేడీయూ, ఎల్​జేపీ కలిసే బరిలోకి దిగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల 50 వేల పడకలు, 2 వేల కొవిడ్​ చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 10 లక్షల పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకున్నాం. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80కోట్ల మంది పేదలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు నడ్డా తెలిపారు

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు-నవంబరులో జరగాల్సి ఉంది. నవంబరు 29తో ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు.