రాజ్యాంగ విరుద్ధం : మహా “సభ” నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్

  • Published By: venkaiahnaidu ,Published On : November 30, 2019 / 09:15 AM IST
రాజ్యాంగ విరుద్ధం : మహా “సభ” నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్

మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో హెడ్ కౌంటింగ్ ఓటు సమయంలో అందరు ఎమ్మెల్యేలు సహకరించాలని ప్రొటెం స్పీకర్ కొరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూనే ఉన్నారు. విశ్వాస పరీక్ష ప్రారంభమైన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.ఈ సెషన్ రాజ్యాంగ విరుద్ధం,అక్రమమని అసెంబ్లీ బయట ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రొటెం స్పీకర్ నియామకం కూడా రాజ్యాంగ విరుద్థమన్నారు. సభ ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ తాము గవర్నర్ కి లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు.

అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అసెంబ్లీ సెషన్ రూల్స్ ప్రకారం నడవడం లేదని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. వందేమాతరం లేకుండానే సెషన్ ప్రారంభమైందని,ఇది రూల్ ఉల్లంఘన అని ఆయన అన్నారు. ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో…సభలో సంబంధం లేని విషయాలను ఫడ్నవీస్ లేవనెత్తుతున్నారని ప్రొటెం స్పీకర్ దిలిప్ పాటిల్ అన్నారు. ఈ ప్రత్యేక సెషన్ కి గవర్నర్ అనుమతి ఇచ్చారని,ఈ సెషన్ రూల్స్ ప్రకారం జరుగుతుందన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

అయితే రాజ్యాంగంపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోతే తనకు సభలో కూర్చొనే హక్కు లేదని ఫడ్నవీస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ కూడా స్పీకర్ ను ఎన్నుకోకుండా విశ్వాస పరీక్ష జరగలేదని ఫడ్నవీస్ అన్నారు. ఈ సారి ఉన్న భయం ఏంటి అని పరోక్షంగా సీఎం ఉద్దవ్ ని ఉద్దేశించి విమర్శించారు. ఈ సెషన్ లో నిబంధనలు ఉల్లంఘించారంటూ సభలో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.