బెంగాల్ హింసలో తమ కార్యకర్త చనిపోయాడంటూ..బతికున్న జర్నలిస్ట్ ఫోటో షేర్ చేసిన బీజేపీ
బెంగాల్ బీజేపీ శాఖ బుధవారం రాత్రి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
BJP పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి తమ కార్యకర్తలపై,నేతలపై తృణముల్ కార్యకర్తలు దాడులుకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు రెండు రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వందల సంఖ్యలో తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని,పలుచోట్ల తమ కార్యకర్తలను చంపేశారని కాషాయపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ శాఖ బుధవారం రాత్రి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుడిన అనంతరం సీతల్ కుచి నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్పడిన రాజకీయ హింసలో తమ కార్యకర్త మానిక్ మోయిత్రో చనిపోయాడని పేర్కొంటూ ఓ వీడియోను బీజేపీ ఫేస్ బుక్ లో షేర్ చేసింది. అయితే బీజేపీ షేర్ చేసిన వీడియోలోని వ్యక్తి నిజానికి బీజేపీ కార్యకర్తనే కాదు. బీజేపీ చెబుతున్నట్లుగా అతడి పేరు మానిక్ మొయిత్రో కూడా కాదు. అతడు ఇండియా టుడే జర్నలిస్ట్ అబ్రో బెనర్జీ.
ఈ విషయమై గురువారం ట్వీట్ చేసిన అబ్రో బెనర్జీ.. తన పేరు మానిక్ మొయిత్రో అని,సీతల్ కుచిలో లో చినిపోయానంటూ బీజేపీ ఐటీ సెల్ ప్రచారం చేస్తుందని,ఇలాంటి ఫేక్ పోస్టలును ఎవ్వరూ నమ్మవద్దని కోరారు. తాను బతికే ఉన్నానని,తాను సీతల్ కుచి కి 1300కిలోమీటర్ల దూరంలో జీవిస్తుంటానని అబ్రో బెనర్జీ ట్వీట్ లో తెలిపారు. బీజేపీ ఐటీ సెల్ తమ కార్యకర్త అని పేర్కొంటూ షేర్ చేసిన తన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు అబ్రో బెనర్జీ.
మరోవైపు, తప్పుడు కథనాలతో ఉన్న పాత వీడియోలను బీజేపీ సర్క్యులేట్ చేస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పాత వీడియోలను సర్క్యులేట్ చేయడం బీజేపీ మానుకోవాలన్నారు.