బీజేపీకి 150 సీట్లు కూడా రావు : చంద్రబాబు జోస్యం

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 02:29 PM IST
బీజేపీకి 150 సీట్లు కూడా రావు : చంద్రబాబు జోస్యం

ఈ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ అడ్రస్ లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా శ్రీరామ్‌నగర్‌లో కాంగ్రెస్‌- జేడీఎస్‌ తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. దేశానికి మోడీ పెద్ద ప్రమాదమని, ఆయన అభివృద్ధి విరోధి అని చంద్రబాబు విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ప్రమాదంలో పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోడీ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి సహకరించకపోగా.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వ్యవస్థలన్నింటిని మోడీ భ్రష్టు పట్టించారని విరుచుకుపడ్డారు. బీజేపీ ఆర్థిక విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు చెప్పడంలో మోడీ దిట్ట అన్న చంద్రబాబు.. సర్జికల్ స్ట్రయిక్స్ పై మోడీ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. మోడీ పాలనలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని చంద్రబాబు వాపోయారు.