అసోం 15వ సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

అసోం 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

అసోం 15వ సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

Swearing In Ceremony Assam

swearing-in ceremony అసోం 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని శ్రీమంత శంకర్​దేవ్​ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్​ జగదీశ్​ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. హిమంతతో పాటు 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌, త్రిపుర సీఎం బిప్లబ్​ దేబ్​, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్‌ సంగ్మా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్​, నాగాలాండ్ సీఎం నీఫ్యూ రియో తదితరులు అతిధులుగా హాజరయ్యారు.

కాగా, ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం జరిగిన బీజేపీ సమావేశంలో శాసనసభా పక్ష నేత హిమంత బిశ్వ శర్మను ఎన్నుకున్నారు. దీంతో సర్బానంద సోనోవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి శర్మ పేరును మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ప్రతిపాదించారు. హిమంత బిశ్వ శర్మ గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

సోమవారం ప్రమాణ స్వీకారం తర్వాత మాట్లాడిన సీఎం హిమంత బిశ్వ శర్మ.. అభివృద్ధిలో దేశంలోనే తొలి ఐదు రాష్ట్రాల్లో అసోంను ఒకటిగా నిలుపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లక్ష్యాన్ని సాధించేందుకు రేపటి నుంచే పని ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ప్రస్తుతం తమ ప్రధాన కర్తవ్యం కొవిడ్​-19 మహమ్మారిని అరికట్టటమేనని సృష్టం చేశారు. రాష్ట్రంలో కొవిడ్​ పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. అసోంలో కరోనా కట్టడి కాకుండా ఈశాన్య ప్రాంతంలోని ఏ రాష్ట్రంలోనూ కేసులు తగ్గుముఖం పట్టవున్నారు. యూఎల్​ఎఫ్​(ఐ) వంటి తిరుగుబాటు బృందాలు ఆయుధాలు విడనాడి, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పటంలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో వారంతా జనజీవన స్రవంతిలో చేరుతారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్​ఆర్​సీ విషయమై స్పందిస్తూ.. సరిహద్దు జిల్లాల్లో 20 శాతం, ఇతర ప్రాంతాల్లో 10 శాతం పేర్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. చిన్న పాటి పొరపాట్లు కనిపిస్తే.. ప్రస్తుత ఎన్​ఆర్​సీని కొనసాగిస్తామని, భారీ స్థాయిలో ఉంటే కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇక,అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే.. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​పై ప్రశంసలు కురిపించారు మోడీ. రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి సోనోవాల్ విశేష కృషి చేశారని కొనియాడారు.