Black Fungus : షాకింగ్.. బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువ.. ప్రతి వందమందిలో 31మరణాలు

దేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్(మ్యుకర్‌ మైకోసిస్‌) కేసులూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాం అని ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. కాగా, మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువ అని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

Black Fungus : షాకింగ్.. బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువ.. ప్రతి వందమందిలో 31మరణాలు

Black Fungus

Black Fungus Found More In Men: దేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్(మ్యుకర్‌ మైకోసిస్‌) కేసులూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాం అని ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. కాగా, మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువ అని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కోల్ కతాలోని జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్ లో విధులు నిర్వర్తించే డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్, డాక్టర్ రీతూ సింగ్, ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ శశాంక్, ఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్, ఒబెసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రాలు.. 101 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై అధ్యయనం చేశారు.

వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ బాధితుల్లో బ్లాక్ ఫంగస్ తీరును పరిశీలించారు. బాధితుల్లో 79 శాతం మంది మగవారే ఉన్నారని గుర్తించారు. ప్రతి వందలో 31 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చనిపోతున్నారని తేల్చారు. 60 శాతం మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు, 41 శాతం మంది కోలుకున్నారని చెప్పారు. 83 శాతం మందికి మధుమేహం ఉందని, మూడు శాతం మందికి కేన్సర్ ఉందని నిర్ధారించారు. 76 శాతం మంది కార్టికో స్టెరాయిడ్లు వాడుతున్నారని డాక్టర్ శశాంక్ వివరించారు.

21 శాతం మందికి రెమ్ డెసివిర్, 4 శాతం మంది టొసిలిజుమాబ్ ను వాడారని చెప్పారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ చక్కెర, స్టెరాయిడ్ల వాడకంతో తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోందని వైద్యుల అధ్యయనం తేల్చింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్టికో స్టెరాయిడ్స్‌ వినియోగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ శశాంక్‌ జోషి అన్నారు.

కాబట్టి కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్‌ పేషెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచించారు. కరోనా పూర్తిగా తగ్గక ముందే శరీరం ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుండగా, కొవిడ్‌ తగ్గాకనే వ్యాధి బయటపడుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధనలో భారత్‌తో సహా అమెరికా, ఇరాన్‌లో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డ రోగులను పరిశీలించామన్నారు.

మ్యుకర్‌ మైకోసిస్‌ సాధారణంగా ముక్కు, సైనస్‌, నాడీవ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులు, చర్మం, దవడ ఎముకలు, కీళ్లు, గుండె, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు. కరోనా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో ప్రస్తుతం ఈ ఇన్‌ఫెక్షన్‌ను ముక్కు, సైనస్‌ ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు.