కమల్ కు వరుస షాక్ లు..పార్టీని వీడిన మరో ఇద్దరు కీలక నాయకులు
మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. పార్టీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకి పెరిగిపోతుంది.పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కారణంగా చూపుతూ ఇప్పుడు మరో ఇద్దరు నాయకులు పార్టీని వీడారు. అందులో ఒకరు యూత్ వింగ్ సెక్రటరీ నవీన్ కార్తిక్ కాగా, మరో వ్యక్తి కడలూర్ జిల్లా ఇంఛార్జి వెంకటేశన్.
సోమవారం కూడా ఇదే కారణంతో పార్టీ కోర్ కమిటీ సభ్యుడు సీకే కుమారవేల్ పార్టీని వీడిన విషయం తెలిసిందే.తనలానే చాలా మంది కమల్ హాసన్ పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. కమల్, ఆఫీస్ బేరర్ల మధ్య సరైన సంబంధాలు లేవని,కేవలం వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా పార్టీ నడుస్తోంది’ అని ఆరోపించారు. అయితే ఆ వెంటనే పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని తెలిపింది. అభ్యర్థుల పేర్లు ఖరారు కాకముందే తను పోటీ చేసే స్థానంపై వేల్ ప్రకటన చేసి నిబంధనలను ఉల్లంఘించారని తెలిపింది.