Britan pm in inida : బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన అందుకేనా..?బోరిస్ బుజ్జగింపులు ఫలిస్తాయా?
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఆంతర్యం అదేనా? రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ను బుజ్జగించే తీరులోనే సాగనుందా? బోరిస్ బుజ్జగింపులకు భారత్ దిగొస్తుందా?
Russia ukraine war..Britan pm in inida : రష్యా, యుక్రెయిన్ యుద్దంలో భారత్ తటస్థ వైఖరిని మార్చడానికి పాశ్చాత్య దేశాలు పడరానిపాట్లు పడుతున్నాయి. భారత్ను బెదిరించి దారికి తెచ్చుకునే పరిస్థితి లేదని గ్రహించి బుజ్జగింపులకు దిగుతున్నాయి. వ్యాపార, ద్వైపాక్షిక బంధాల పేరుతో భారత్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన కూడా ఈ తీరులోనే సాగనుంది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నెల 21, 22తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. గతంలో రెండు సార్లు కరోనా కారణంగా వాయిదాపడిన బోరిస్ జాన్సన్ భారత పర్యటన…ఈ సారి షెడ్యూల్ ప్రకారం సాగనుంది. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య బంధాలు పటిష్టం చేయడమే పర్యటన లక్ష్యమని చెబుతున్నప్పటికీ..ప్రధాని మోదీకి, బోరిస్ జాన్సన్కు మధ్య జరిగే చర్చల్లో యుక్రెయిన్ యుద్ధ అంశమే కీలకం కానుంది. గత వారం బోరిస్ జాన్సన్ కీవ్ వీధుల్లో జెలన్ స్కీతో కలిసి ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది జరిగిన పదిరోజులకే భారత్ పర్యటనకు వస్తున్నారు.
Also read : 50 Days Russia War : యుక్రెయిన్లో మొదటి 50 రోజుల రష్యా యుద్ధం.. ఫొటోలు ఇవే..!
యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిపై అమెరికా తరహాలో బ్రిటన్ బహిరంగంగా ఏ వ్యాఖ్యలూ, విమర్శలూ చేయనప్పటికీ….భారత్కు నచ్చచెప్పాలని మాత్రం ప్రయత్నిస్తోంది. అమెరికా, బ్రిటన్ తో పాటు మరికొన్ని దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలతో అనుకున్నమేర ప్రయోజనం దక్కడం లేదన్న భావనలో ఉన్నాయి. దీనికి కారణం అమెరికా ఆపేసిన చమురు కొనుగోలును రష్యా నుంచి భారత్, చైనా కొనుగోలు చేస్తుండడమే. అమెరికా బహిరంగంగానే చమురు కొనుగోలుపై విమర్శలు చేసింది. బ్రిటన్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆయుధాల దిగుమతి కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడడాన్ని భారత్ తగ్గించుకోవాలని బ్రిటన్ వ్యాఖ్యానించింది. గత నెలలో భారత్లో పర్యటించిన బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ రష్యాపై ఆంక్షలువిధించేందుకు భారత్ను ఒప్పించే ప్రయత్నం చేశారు.
బ్రిటన్ నేతల భారత్ వరుస పర్యటనలకు కారణం..యుద్ధం విషయంలో భారత్ వైఖరి మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించడమే. భారత్ను అదే పనిగా ఆయా దేశాలు పొగడడానికి కూడా కారణమిదే. గత వారం భారత్, అమెరికా విదేశాంగ, రక్షణమంత్రుల సమావేశానికి ముందు బైడన్ మన దేశాన్ని ఉద్దేశించి కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో తమకు భారత్తో సంబంధాలు అత్యంత ప్రాధాన్యమైనవని వ్యాఖ్యానించారు. ఇప్పుడు భారత్ పర్యటనకు ముందు బోరిస్ జాన్సన్ కూడా మనదేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థల్లో భారత్ ఒకటని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమని అన్నారు. చాలా రంగాల్లో భారత్ను బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తోందని తెలిపారు. రక్షణ, వాణిజ్య బంధాలు, ఆర్థిక వృద్ధి, ఇంధనం వంటి విషయాలపై రెండు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరగనున్నాయి.
Also read : Russia ukriane war : వ్యూహం మార్చిన రష్యా..మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?!
బ్రిటన్, అమెరికా నేతల పొగడ్తలు గమనిస్తే…అంతర్జాతీయ భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యత అర్ధమవుతుంది. అయితే ఇదే సమయంలో పాశ్చాత్య దేశాలతో జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలూ వినపడుతున్నాయి. ఓ పక్క పొగుడుతూనే..మరోపక్క విమర్శలు చేయడం ఈ దేశాలకు వెన్నతో పెట్టిన విద్య అని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్ కు ఈ వారంలో అమెరికా పర్యటనలో ఎదురయిన అనుభవాలను గుర్తుచేస్తున్నారు. న్యూయార్క్ లో ఓ సమావేశంలో అమెరికా రక్షణమంత్రి ఆంటోని బ్లింకెన్..భారత్ తమకు మిత్రదేశమంటూనే….అబద్ధపు ఆరోపణలు చేశారు.
భారత్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను గమనిస్తున్నామన్నారు. ఆ సమయంలో రాజ్నాథ్, జయశంకర్ మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత జయశంకర్ ఆంటోని బ్లింకెన్కు మరో సమావేశంలో గట్టిగా బదులిచ్చారు. అమెరికా మానవ హక్కుల విషయంలో ఎలా వ్యవహరిస్తోందనేదానిపై తాము చాలా చెప్పగలమన్న జయశంకర్ వ్యాఖ్యలు విని వాషింగ్టన్ మీడియా నివ్వెరబోయింది.రష్యా నుంచి చమురుకొనుగోలుపైనా జయశంకర్ ఇలాగే విమర్శలకు చెక్పెట్టారు. భారత్ చమురు కొనుగోలుపై పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని…కానీ యూరప్ ఒక్కరోజులో కొనుగోలుచేసింత చమురు..భారత్ నెలంతా కూడా కొనదని చెప్పి….అమెరికా సహా ఇతర దేశాల నోళ్లు మూయించారు.
Also read : Pak- Afghan : అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..?ఇప్పుడు వైఖరి ఎందుకు మారింది?
ఒక్క అమెరికాతోనే కాదని…బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నింటితోనూ విదేశాంగ విధానం విషయంలో భారత్ గట్టిగా వ్యవహరించాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. విమర్శలను తిప్పికొడుతూ స్వప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.