పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు..ఎర్రకోట విధ్వంసం గుర్తులు

పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు..ఎర్రకోట విధ్వంసం గుర్తులు

Red Fort : పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు…ట్రాక్టర్ పరేడ్‌లో భాగంగా కొందరు రైతులు ఎర్రకోటలో చేసిన విధ్వంసం గుర్తులు ఇవి. రూట్ మ్యాప్ మార్చి 2021, జనవరి 26వ తేదీ మంగళవారం ఎర్రకోట వైపు కవాతు మళ్లించిన కొందరు రైతులు ఎర్రకోటలో విధ్వంసం సృష్టించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్‌ ఎర్రకోటను పరిశీలించారు. అటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సీనియర్ అధికారులతో సమావేశమై ఘటనలపై చర్చించారు.

అటు రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌తో రణరంగంగా మారిన ఢిల్లీలో ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఢిల్లీ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట దగ్గర భారీగా బలగాలను మోహరించారు. టిక్రి సరిహద్దుల్లో రైతులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ కూడా భారీగా భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్, నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వేలాదిగా వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఘాజీపూర్‌ -ఆనంద్ విహార్ మార్గంలోనూ వాహనాలు బారులు తీరాయి. ఈ దృశ్యం చీమల దండులా కనిపిస్తోంది.

ఘాజీపూర్ మండీ, తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి, 24వ నెంబరు జాతీయ రహదారి, కన్నాట్ ప్లేస్‌కు వెళ్లి మార్గం మూసివేశారు. పరేడ్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆందోళనకారుల దాడిలో 300మందికి పైగా పోలీసులు గాయపడ్డారని తెలిపారు. 25 వాహనాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. రైతుల ఆందోళనలు కొనసాగుతుండడంతో ప్రధాన ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించారు. రాజ్‌పథ్, ఇండియా గేట్, ఎర్రకోట, రాంలీలా మైదాన్, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం దగ్గర సెక్యూరిటీ పెంచారు.