నెల తిరక్కముందే : కేఫ్ కాఫీడే వీజీ సిధ్ధార్ధ ఇంట్లో మరో విషాదం

  • Published By: chvmurthy ,Published On : August 25, 2019 / 12:39 PM IST
నెల తిరక్కముందే : కేఫ్ కాఫీడే వీజీ సిధ్ధార్ధ ఇంట్లో మరో విషాదం

మైసూరు:  ‘కేఫ్ కాపీ డే ‘ వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు.  మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆగస్టు25 ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో  వీజీ సిద్ధార్థ 2019 జులై 29 నాడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 

వీజీ సిధ్ధార్ధ తండ్రి గంగయ్య హెగ్డే వయస్సు 96 ఏళ్లు. సిద్ధార్థ చనిపోక ముందు నుంచి ఈయన ఆస్పత్రిలో కోమాలో ఉన్నారు. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకొనే ముందు ఆఖరిసారి తండ్రిని చూసి ఆయన వద్ద కొద్దిసేపు గడిపి వెళ్లారు. కుమారుడు చనిపోయిన సంగతి కోమాలో ఉన్న గంగయ్య హెగ్డేకు తెలియకపోవడం గమనార్హం. గంగయ్య హెగ్డే కాఫీ రైతు. తన ఉద్యోగుల  మంచి చెడులు చూసుకొనే దయగల వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. కాఫీ డే వ్యాపారాన్ని ఏర్పాటు చేసేందుకు కొడుకు సిద్ధార్థకు సలహా ఇచ్చి, అతనికి ఆర్థికంగా సహకారం అందించారు.

1990లో మొదటిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో వీజీ సిధ్ధార్ధ ‘కేఫ్ కాఫీ డే’ను ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే ‘కేఫ్‌ కాఫీ డే’ ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా తీర్చి దిద్దారు.కెఫే కాఫీ డే ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా 1750 కెఫేలు ఉండగా.. మలేసియా, నేపాల్, ఈజిఫ్టులో కూడా అవుట్ లెట్లు ఉన్నాయి.తన సంస్థల్లో సుమారు 30 వేల మందికి ఉపాధి కల్పించారు. మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రావతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్‌.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు.