ముగిసిన ఆరో దఫా బెంగాల్ ఎన్నికల ప్రచారం

పశ్చిమ బెంగాల్​లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది.

ముగిసిన ఆరో దఫా బెంగాల్ ఎన్నికల ప్రచారం

Campaigning Comes To An End For 6th Phase Of Bengal Assembly Polls

Bengal polls పశ్చిమ బెంగాల్​లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రం 6:30గంటలకు ముగిసింది. ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం(ఏప్రిల్-22,2021)పోలింగ్​ జరగనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న వేళ ఎన్నికల ప్రచార ముగింపు గడువును 48గంటల నుంచి 72గంటలకు పొడిగించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఓటింగ్​కు మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని ఆయా పార్టీలకు సూచించింది. చివరి మూడు దఫాల ఓటింగ్​కూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది. అంతకుముందున్న నిబంధనల ప్రకారం.. పోలింగ్​ తేదీకి 48 గంటల ముందువరకు ప్రచారం నిర్వహించేందుకు వీలుండేది.

ఆరో దశలో భాగంగా గురువారం ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 17 స్థానాలకు, నదియా జిల్లాలోని 9స్థానాలకు, ఉత్తర్​ దినాజ్​పుర్​ జిల్లాలోని 9 స్థానాలకు, పూర్వ బర్ధామన్ జిల్లాలోని 8 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. 14,480 పోలింగ్​ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6:30గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా.. 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్​ రాయ్​, తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) సీనియర్​ నేతలు జ్యోతిప్రియ మల్లిక్​, చంద్రిమ భట్టాచార్య, సీపీఐ(ఎం) తరఫున తన్మయ్​ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ తరఫున బరిలోకి దిగనున్న ఫిల్మ్ డైరక్టర్ రాజ్​ చక్రవర్తి, నటి కౌషాని ముఖర్జీ కూడా ఆరో దశ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్​లో.. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్​ జరిగింది. మిగిలిన 114 సీట్లకు మూడు దశల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.