నిలువునా దోచేస్తున్నారు : బుక్ మై షో, పీవీఆర్ చీటింగ్ బట్టబయలు
ప్రముఖ మూవీ టికెటింగ్ అప్లికేషన్లు, వెబ్ సైట్లు.. బుక్ మై షో, పీవీఆర్ ల చీటింగ్ బయటపడింది. జనాలను అడ్డంగా దోచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. వారు చేస్తున్న మోసం పేరు.. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ. సాధారణంగా టికెట్ బుక్ చేసే సమయంలో జీఎస్టీ కాకుండా.. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ వసూలు చేస్తున్నారు. నిజానికి ఆ ఫీజును వసూలు చేయకూడదు. అది చట్ట విరుద్ధం.
హైదరాబాద్కు చెందిన విజయ్ గోపాల్ అనే ఆర్టీఐ (సమాచార హక్కు) కార్యకర్త (ఫోరమ్ అగైనెస్ట్ కరెప్షన్) ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఐ ద్వారా ఆర్బీఐకి ఆయన ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. బుక్ మై షో, పీవీఆర్ లాంటి సైట్లు, యాప్లలో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు విధిస్తున్నారు. అలా వసూలు చేయొచ్చా..? అని సమాధానం కోరారు. దీనికి స్పందించిన ఆర్బీఐ.. తాము అలాంటి నిబంధన ఏదీ పెట్టలేదన్నారు. ఏ వెబ్సైట్ లేదా యాప్.. కస్టమర్ల నుంచి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు వసూలు చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆయా మర్చంట్లు కేవలం బ్యాంకులకు మాత్రమే Merchant Discount Rate (MDR) నియమ నిబంధనల ప్రకారం కస్టమర్లు చేసిన క్రెడిట్, డెబిట్, ఇంటర్నెట్ లావాదేవీలకు అనుగుణంగా బ్యాంకులకు ఫీజు చెల్లించాలని, కానీ మర్చంట్లు అదే ఫీజును కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని ఆర్బీఐ తెలిపింది.
Read Also: అమ్మకానికి రోడ్డు : డీల్ విలువ రూ. 3వేల కోట్లు
అంటే.. బుక్ మై షో కావచ్చు, మరే ఇతర సైట్ లేదా యాప్ కావచ్చు… అందులో కస్టమర్లు చేసే ట్రాన్సాక్షన్లకు ఫీజు వసూలు చేయకూడదు. మొత్తం సొమ్ము, జీఎస్టీ మాత్రమే తీసుకోవాలి. కానీ బుక్ మై షో, పీవీఆర్ మాత్రం ఎప్పటి నుంచో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఆర్బీఐ చెప్పిన ఎండీఆర్ నిబంధనలకు ఇది వ్యతిరేకం. అంటే.. చట్టవిరుద్ధమన్నమాట. బుక్ మై షో, పీవీఆర్ లాంటి సంస్థలు తమ సైట్లు, యాప్లలో టిక్కెట్లు బుక్ చేసుకుంటే చట్టవిరుద్ధంగా ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ విజయ్ గోపాల్ ఆ సంస్థలపై వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టారు. ఆ కేసును మార్చి 23న ఫోరం విచారించనుంది.
కేవలం ఈ 2 సైట్లు మాత్రమే కాదు.. ఇంకా అనేక సైట్లు, యాప్లు ఇలాంటి దందానే చేస్తున్నాయి. జనాలను దోచేస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే వాటికి అయ్యే చార్జిలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నిజానికి అలా చేయరాదు. సదరు మర్చంట్లే ఆ చార్జిలను బ్యాంకులకు చెల్లించాలి. కానీ వారు ఆ చార్జిలను కస్టమర్ల నుంచి వసూలు చేసి బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. మనకా ఆ నిజం తెలియక కష్టపడి సంపాదించిన డబ్బుని అనవసరంగా నష్టపోతున్నాం. ఇక ముందు నష్టపోకుండా చూసుకుందాం. క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేస్తే మర్చంట్లకు ఎలాంటి చార్జిలను చెల్లించకండి.