Caste-Based Census : కులాలవారీగా జనగణన..మోదీని కలిసిన బీహార్ అఖిలపక్షం

కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​.

Caste-Based Census : కులాలవారీగా జనగణన..మోదీని కలిసిన బీహార్ అఖిలపక్షం

Bihar (1)

కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​. ఇందులో భాగంగా నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో బీహార్‌లోని అఖిలపక్ష నేతలు(10 పార్టీల నేతలు) సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మోదీని కలిసిన అఖిలపక్ష బృందంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. కులాలవారీగా జనగణన జరిపి, వెనుకబడిన వర్గాల ప్రజల సమాచారం తెలుసుకుంటే.. వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చని బిహార్‌ ప్రతినిధి బృందం ప్రధానికి వివరించింది.

ప్రధానితో సమావేశం అనంతరం సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ..బీహార్ కి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు కులగణనపై తమ అభిప్రాయాలను ప్రధాని ముందుంచారు. కులగణనపై 2019 మరియు 2020లో బీహార్ అసెంబ్లీ,శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. ఒకసారి కులాలవారీగా జనగణన జరిగితే అన్ని కులాల సమాచారం మన వద్ద ఉంటుంది. ప్రభుత్వాలు వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయా వర్గాల ప్రజల శాతానికి తగ్గట్టుగా వారికి ప్రస్తుతం ప్రయోజనం కలగడం లేదు. వారి సమాచారం తెలుసుకుంటే వారి అభివృద్ధికి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్ని అంశాల్లో వారిని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. కులాలవారీగా జనగణన అంశంపై బీహార్ ప్రజలు మాత్రేమే కాదు దేశమంతా ఇదే అభిప్రాయంతో ఉంది. ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని మేమంతా ప్రధానిని కోరాం. ప్రధానమంత్రి మా వాదనలు పూర్తిగా ఆలకించారు. ఇప్పుడు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం ప్రధాని చేతుల్లోనే ఉందని నితీశ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. కేవలం బీహార్‌లో మాత్రమే కులాలవారీగా జనగణన కోసం మా ప్రతినిధుల బృందం ప్రధానిని కలవలేదు. దేశమంతా కులాలవారీగా జనగణన జరగాలని మోదీని కలిశాం. జంతువులు, వృక్షాల గణన కూడా జరుగుతున్నప్పుడు మనుషులు ఏ కులానికి చెందినవారు అనే గణన జరిగితే తప్పేంటి? ప్రజలు ఏ కులానికి చెందినవారో తెలిస్తే రిజర్వేషన్లు కల్పించడం సులభం అవుతుంది. మా వాదనను ప్రధాని సావధానంగా విన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తాం. కులాలవారీగా జనగణన చారిత్రకం అవుతుందని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు.

కాగా, గత నెలలో పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రమే లెక్కిస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో కుల గణన అంశం బయటకొచ్చింది. బీహార్ వంటి రాష్ట్రాల్లో మండల్ కమిషన్‌ కాలం నుంచే ఓబీసీలదే రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉండటం వల్ల కులగణన చేపట్టాలని బీహార్‌ రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్న విషయం తెలిసిందే.