వెరైటీగా ఉంది కదా : తాగి దొరికితే ఊరంతా మటన్ పార్టీ ఇవ్వాలి

  • Published By: veegamteam ,Published On : October 18, 2019 / 09:20 AM IST
వెరైటీగా ఉంది కదా : తాగి దొరికితే ఊరంతా మటన్ పార్టీ ఇవ్వాలి

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఫైన్ కట్టాలి.. జైలుకి వెళ్లాలి. ఇదే మనకు తెలిసింది. అక్కడ మాత్రం సీన్ రివర్స్. తాగి దొరికితే పార్టీ ఇవ్వాలి. అలాంటి ఇలాంటి పార్టీ కాదండీ అదీ.. భారీ ఎత్తున ఉంటుంది. అక్షరాల 25వేల రూపాయలు ఖర్చు చేయాలి. అందరికీ మటన్, వీట్ బాల్స్ తో ఖుషీ చేయాలి. 700 నుంచి 800 మంది వరకు పార్టీ ఉండాలి. ఊర్లోని కుర్రోళ్లు అందరినీ పార్టీకి ఆహ్వానించాలి. అందరూ హ్యాపీ తిన్నారా లేదా అని దగ్గరుండి చూసుకోవాలి. మర్యాదలు బాగా చేయాలి. ఈ పార్టీ వెరైటీ ఉంది.. ఎక్కడ అనుకుంటున్నారా.. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్ రాష్ట్రం. మనస్కంత జిల్లా. అమీర్ ఘడ్ తాలూకా. కట్టిసితార గ్రామం అది. మద్య నిషేధం గట్టిగా అమల్లో ఉంది. ముఖ్యంగా యువతను మత్తుకు దూరంగా ఉంచాలనేది ఆ గ్రామం సంకల్పం. దీని కోసం గ్రామం అంతా కలిసి ఓ తీర్మానం చేశారు. ఎవరైనా సరే మందు కొట్టి దొరికితే స్పాట్ లో 2వేల రూపాయలు జరిమానా కట్టాలి. నెల రోజుల వ్యవధిలో మటన్ పార్టీ ఇవ్వాలి. మందు కొట్టి అల్లరి చేస్తే మాత్రం స్పాట్ లోనే 5వేల ఫైన్ కట్టాలి. ఆ తర్వాత ఘనంగా విందు ఏర్పాటు చేయాలి. ఈ పార్టీలకు భయపడిన కుర్రోళ్లు మందు తాగటమే మానేశారు. తాగి దొరికితే ఎక్కడ 25వేలు ఖర్చు చేయాలనే భయం కూడా ఉంది. దీంతో 2018 సంవత్సరంలో ఒక్కరు కూడా ఆ గ్రామంలో మందు కొట్టలేదు.

రీసెంట్ గా 2019లో పక్క గ్రామంలో మందు తాగి కట్టిసితార గ్రామానికి వచ్చాడు ఓ యువకుడు. గ్రామంలో హల్ చల్ చేశాడు. వాడినీ వదల్లేదు గ్రామస్తులు. పట్టుకుని పాతిక వేలు (25వేలు) వసూలు చేశారు. మటన్ పార్టీ చేసుకున్నారు. డబ్బులు కట్టే వరకు వదల్లేదంట వాడిని.

మందు తాగటం కంటే.. ఆ తర్వాత ఇచ్చే పార్టీ ఖర్చుకు భయపడిపోతున్నారంట గ్రామస్తులు. మందు జోలికే వెళ్లటం లేదు. భలే ఐడియా కదా.. మన దగ్గర కూడా ఇలాంటి సిస్టమ్ ఉంటే.. రోజూ పార్టీలే కదా అంటున్నారు నెటిజన్లు.