Central Government : ఐదు నెలల్లో అందుబాటులోకి 135 కోట్ల టీకాలు!
Central Government : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి వేగం మరింత పెంచేలా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు అడుగులు వేస్తున్నాయి. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టంచేసింది. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు 50 కోట్లు, కొవాక్సిన్ డోసులు 40 కోట్లు, బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ డోసులు 30 కోట్లు, స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు 10 కోట్లు, జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్ డోసులు 5 కోట్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్రం తన అఫిడవిట్లో వివరించింది.
జులై 31 నాటికి 51.6 కోట్ల డోస్ ల కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని కేంద్రం తెలిపింది. ఏడాది మొత్తం 188 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామని తెలిపింది. కాగా ఆదివారం వరకు 32,17,60,077 మందికి కరోనా టీకాలు ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 64,25,893 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు వైద్య సిబ్బంది. ఇక ఈ ఏడాది చివరి నాటికి 188 కోట్ల డోస్ ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇవి దేశంలోని 18 ఏళ్ళు దాటిన 94 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేసేందుకు సరిపోతాయి.