Central Vista Project : సెంట్రల్ విస్టా పనులు ఆపాలన్న పిటిషన్ తిరస్కరణ..పిటిషనర్ కు రూ.1లక్ష జరిమానా
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని,ఈ ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని.. ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ లభిస్తుందంటూ..
Central Vista Project కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని,ఈ ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని.. ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ లభిస్తుందంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సొహైల్ హాస్మి, ట్రాన్స్ లేటర్ అన్యా మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జ్యోతి సింగ్లతో కూడిన ధర్మాసనం మే-17న తీర్పు రిజర్వ్ చేసి..ఇవాళ(మే-31,2021) తీర్పు వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని..ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంబంధిత డీడీఎంఏ ఆదేశాల గురించి కోర్టు ప్రస్తావిస్తూ.. పనులు నిషేధించాల్సిందిగా అందులో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. కార్మికులు ఇప్పటికీ నిర్మాణ ప్రదేశంలోనే ఉంటూ పనులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పనులను ఆపే ప్రశ్నే తలెత్తదని కోర్టు చెప్పింది. అంతేకాకుండా,ఈ పిల్లో ప్రజా ప్రయోజనాలు లేవని కోర్టు పేర్కొంది. పిటిషనర్ ఈ పిల్ను దురుద్దేశంతో కోర్టులో దాఖలు చేసినట్లు మండిపడింది. పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు.
కాగా,కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవంతితో పాటు ప్రధాని, ఉప రాష్ట్రపతి నివాస సముదాయాలను నిర్మిస్తున్నారు. అలాగే పలు మంత్రిత్వ శాఖల కార్యాలయాలతో కూడిన సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్ ను నిర్మించనున్నారు.