సెంట్రల్ విస్టా పనులు షురూ..రూ. 11 వేల 794 కోట్లు ఖర్చు!

సెంట్రల్ విస్టా పనులు షురూ..రూ. 11 వేల 794 కోట్లు ఖర్చు!

Central Vista redevelopment : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తోంది కేంద్రం. ఇప్పటికే 14 మందితో కూడిన హెరిటేజ్‌ కమిటీ సోమవారమే అనుమతులు ఇచ్చింది. పనులు చేపట్టనున్న టాటా ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ ఇప్పటికే యంత్రసామగ్రి, ఇతర సరంజామాను సిద్ధం చేసింది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులోని నిర్మాణాలను భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ప్లాన్‌ చేశారు. 2021 ఆగస్టు 15 నాటికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఏడాది ఆగస్టు 15న దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనుంది. ఈ అరుదైన ఘట్టానికి సాక్ష్యంగా పార్లమెంట్ కొత్త భవనాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. మొత్తం 18లక్షల 37వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించే సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు కోసం 11వేల 794 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. పాత భవనాన్ని కూల్చేయకుండా వారసత్వ సంపదగా కొనసాగించనుంది ప్రభుత్వం. కూల్చివేతపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాత పార్లమెంట్‌ భవనాన్ని అలానే ఉంచాలని నిర్ణయించింది. పురాతన పార్లమెంట్ భవనంలో భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతోంది. కొత్త భవన నిర్మాణం అయ్యాక ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్క చోటకే వస్తాయి. ఢిల్లీలో వివిధ చోట్ల ఉన్న పాలనా కార్యాలయాలన్నీ.. ఒక్క చోటకు తెచ్చేలా.. ఓ కొత్త కార్యాలయ భవన సముదాయాల్ని నిర్మించాలని నిర్ణయించింది.

గతేడాది డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ పనులకు శంకుస్థాపన చేశారు.
పార్లమెంట్‌ కొత్త భవనంలో గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్థులు ప్రస్తుత భవనం ఎత్తు ఉండేలా కొత్త భవనం నిర్మాణం.
ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు.
లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు.
విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు.

మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు.
కొత్త భవనంలో సభ్యులందరికీ డెస్క్‌లు సౌకర్యం.
లోక్‌సభను ఆనుకొని ప్రధానమంత్రి కార్యాలయం, 20 మీటర్ల ఎత్తులో కానిస్టిట్యూషనల్‌ హాల్‌, దానిపై అశోక స్థూపం నిర్మాణం.
 నూతన భవనంలో అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు.
1921, ఫిబ్రవరి 21న ప్రస్తుత పార్లమెంట్‌కు శంకుస్థాపన చేశారు.
1927, జనవరి 18న పార్లమెంట్‌ ప్రారంభోత్సవం చేశారు.