సెప్టెంబరు-7 నుంచి మెట్రో సేవలు…మాస్కు లేకుంటే నో ఎంట్రీ
కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత సెప్టెంబరు 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఇందుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ని ఇవాళ(సెప్టెంబర్-2,2020)కేంద్రం విడుదల చేసింది. 15 మెట్రో రైల్ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో కేంద్రం మంగళవారం చర్చించిన అనంతరం ఎస్ఓపీని నిర్ణయించింది. దాని ప్రకారం మెట్రో సేవలను తొలుత గ్రేడెడ్ పద్దతిలో ప్రారంభిస్తారు. సెప్టెంబర్ ఏడు నుంచి ఒకటి కంటే ఎక్కువ లైన్లలో సేవలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 12 నాటికి అన్ని కారిడార్లు పని చేస్తాయి.
అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో అన్ని స్టేషన్లు మూసివేసే ఉంటాయి.
మార్గదర్శకాలు ఇవే
– ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
– భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి
-.ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి.
– కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే బోర్డింగ్కు అనుమతి -ప్రయాణికులు ఉపయోగం కోసం స్టేషన్ ఎంట్రీ వద్ద శానిటైజర్
-ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి
కాగా, దేశ రాజధానిలో మూడు దశల్లో, నిర్దిష్ట సమయాల్లో మెట్రో రైల్ సేవలను పునరుద్ధరించనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపింది. మొదటి దశలో భాగంగా ఈ నెల 7న పసుపు మార్గాలైన సమైపూర్ బద్లి నుండి హుడా సిటీ సెంటర్ వరకు,రెండో దశలో భాగంగా ఈ నెల 9న నీలం, గులాబీ మార్గాలతోపాటు గుర్గావ్ లేన్లో, వరగా మూడో దశలో భాగంగా ఈ నెల 10న రెడ్ లైన్లోని ఘజియాబాద్ నుండి రితాలా, బహదూర్గఢ్, ఫరీదాబాద్ మార్గాలలో మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయని డీఎంఆర్సీ చీఫ్ మంగు సింగ్ తెలిపారు.
తొలుత ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో రైలు నడుస్తాయని మంగు సింగ్ వెల్లడించారు. అలాగే మెట్రో రైల్ స్టేషన్లలోకి ప్రయాణికుల ప్రవేశం కోసం నిర్దేశించిన గేట్లు మాత్రమే తెరుస్తారని అన్నారు. బయటకు వెళ్లేవారి కోసం వేరే గేటు ఉంటుందన్నారు. మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు స్మార్ట్ కార్డులు, నగదు రహిత ఆన్లైన్ చెల్లింపులను అనుమతిస్తామని తెలిపారు.