Amith Shah : త్వరలో కొత్త కోఆపరేటివ్ పాలసీ
నూతన సహకార విధానాన్ని త్వరలోనే కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన
నూతన సహకార విధానాన్ని త్వరలోనే కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ సహకార సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా.. దేశ అభివృద్ధిలో సహకార మంత్రిత్వ శాఖ అద్భుత సామర్ధ్యంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ నూతన సహకార విధానాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఇది గ్రామీణ సమాజాన్ని బలోపేతం చేస్తుందని అమిత్ షా అన్నారు.
ALSO READ ముంబైతో బైడెన్ కనెక్షన్..డాక్యుమెంట్స్ చూపెట్టిన మోదీ
దేశ ఆర్ధిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగేందుకు సహకార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు దేశంలో 91 శాతం గ్రామాల్లో సహకార సంస్ధలు పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను వచ్చే ఐదేళ్లలో 3 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 65 వేల పీఏసీలు ఉన్నాయని అమిత్ షా చెప్పారు.
వివిధ సహకార సంఘాల 2,100 మంది ప్రతినిధులు మరియు దాదాపు 6 కోట్ల మంది ఆన్లైన్ పార్టిసిపెంట్స్తో కూడిన సభలో ప్రసంగించిన షా.. సహకార సంఘం రాష్ట్ర విషయం కాబట్టి కేంద్రం ఈ కొత్త మంత్రిత్వ శాఖను(సహకార మంత్రిత్వశాఖ) ఎందుకు సృష్టించిందని కొంతమంది ఆశ్చర్యపోతున్నారని అన్నారు. దీనికి చట్టబద్ధంగా సమాధానం ఇవ్వొచ్చు కానీ ఈ వివాదంలోకి తాను తలదూర్చాలనుకోవడం లేదన్నారు.
ఎలాంటి ఘర్షణ లేకుండానే కేంద్రం రాష్ట్రాలతో సహకారం కొనసాగిస్తుందన్నారు. వీటి గురించి తమ ప్రభుత్వానికి అవగాహన ఉందని తెలిపారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూనే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ రంగాన్ని ఆధునికీకరించి, మరింత బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖను రూపొందించామన్నారు. 2000లో అప్పటి వాజ్పేయీ ప్రభుత్వం తర్వాత.. మోదీ సర్కారే సహకార విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని షా తెలిపారు. సహకార ఉద్యమం దేశానికి ఇప్పుడు అత్యవసరమని అన్నారు. దేశ అభివృద్ధికి సహకార సంఘాలు విశేషంగా తోడ్పాటు అందిస్తున్నాయని చెప్పారు.