అందరూ చౌకీదారులేనా! : అంబానీ కోసం చౌకీదార్ మోడీ రాఫెల్ డోర్ తెరిచాడు

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2019 / 12:54 PM IST
అందరూ చౌకీదారులేనా! : అంబానీ కోసం చౌకీదార్ మోడీ రాఫెల్ డోర్ తెరిచాడు

ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్‌ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(మార్చి-19,2019) అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌ లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాలకు యూపీఏ ప్రత్యేక హోదా ఇచ్చింది.దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున మేము ఈ పని చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సి ఉంది.ఇందుకు సంబంధించిన విధానాలను బీజేపీ పక్కన పెట్టేసింది. జాతీయ పౌర రిజిస్టర్ (NRC) అంశం అరుణాచల్‌ ప్రదేశ్‌ను నాశనం చేసే కుట్ర.అరుణాచల్‌ ప్రదేశ్‌కి మరిన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది.
Read Also : సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి

మేము మీ సంస్కృతిని నాశనం చేయాలనుకోవడం లేదు.దేశం మొత్తం మీద ఒకే సంస్కృతిని రుద్దాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లు భావిస్తున్నాయి.బీజేపీ తమ భావజాలాన్ని ఈశాన్య రాష్ట్రాలపై రుద్దడానికి వీల్లేదు. విద్యావ్యవస్థపై కూడా దాడి జరుగుతోంది. యూనివర్శిటీలకు ఉపకులపతులుగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ తమకు చెందిన వ్యక్తులను నియమిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల తక్కువ ధరకే కొనుగోలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ భావించారు. ఇప్పుడు మాత్రం అధిక ధరకు కొంటున్నారు. దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని రాహుల్ ప్రశ్నించారు. 

చౌకీదార్ నరేంద్రమోడీ అనిల్ అంబానీకి రూ.30,000కోట్లు దోచిపెట్టేందుకు రాఫెల్ డోర్ ఓపెన్ చేశాడని ఆరోపించారు. అప్పట్లో తాను ఒక్కడినే చౌకీదార్‌ నని చెప్పిన ఆయన ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ అన్నారు.కాంగ్రెస్ ముక్త్ భారత్‌ అని మోదీ అన్నారని, ఆయన హృదయంలో ద్వేషం ఉందన్నారు. తాము మాత్రం ఎవరినీ నాశనం చేయాలని భావించట్లేదని రాహుల్ తెలిపారు.  పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో మోడీ తన ప్రచారానికి సంబంధించిన ఫొటోలు తీసుకుంటూ బిజీగా గడిపారన్నారు. మోదీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్దనోట్లను రద్దు చేయడం. ఇది తెలివితక్కువ చర్య అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడన్నారు.
Read Also : నడిరోడ్డుపై జవాన్ ని కాల్చేశారు