Covid-19 Deaths : కరోనా మరణాలు భారత్లోనే తక్కువ.. ఆ వార్తలు నమ్మొద్దు.. WHO డేటా ఇదిగో..!
Covid-19 Deaths : కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో భారత్లో కరోనా మరణాలు తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Covid-19 Deaths : కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో భారత్లో కరోనా మరణాలు తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చునని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో ప్రతి పదిలక్షల జనాభాకు 374 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ తీవ్రత అధిక స్థాయిలో విజృంభిస్తోన్న అమెరికా, బ్రెజిల్, రష్యా, మెక్సికో వంటి దేశాలతో పోలిస్తే కొవిడ్ మరణాల రేటు భారత్లోనే చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది.
భారత్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రతి 10 లక్షల మందికి అతి తక్కువ కొవిడ్ మరణాలు నమోదైన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. అమెరికాలో 10 లక్షల మందికి 2వేల 920 మరణాలు నమోదయ్యాయి. ఇక బ్రెజిల్లో 3వేల 92, రష్యాలో 2వేల 506, మెక్సికోలో 2వేల 498 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
అదే భారత్లో ప్రతి 10 లక్షల జనాభాకు 374 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయిని, వాటితో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాలకు సంబంధించి మే 10, 2020న I.C.M.R మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికి సంబంధించి నిబంధనలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు.
కరోనా మరణాలు భారీగా పెరిగాయంటూ వచ్చిన నివేదికలన్నీ వాస్తవాలు కాదని, అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అంచనా మాత్రమేనని కేంద్రం స్పష్టంచేసింది. దేశంలో కొంత జనాభాకు సంబంధించి డేటాను సేకరించి గణాంక పద్ధతిలో రూపొందించినవేనని తెలిపింది. ఆ పరిమిత నమూనాలతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్యతో అంచనా వేశారని పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన డేటాను అన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
Read Also : Most Covid Deaths : దేశంలో కరోనా మరణాలు.. ఎక్కువగా గుండె లేదా కిడ్నీ వ్యాధుల కారణంగానే.. నివేదిక వెల్లడి!