Biryani Fighting: బిర్యానీకోసం గొడవపడ్డ వృద్ధ దంపతులు.. కోపంతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త.. ఇద్దరి పరిస్థితి విషమం..
బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య గొడవకాస్త వారి ప్రాణాలమీదకు తెచ్చింది. గొడవ సమయంలో మాటామాటా పెరగడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
Biryani Fighting: బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య గొడవకాస్త వారి ప్రాణాలమీదకు తెచ్చింది. గొడవ సమయంలో మాటామాటా పెరగడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కేకలువేస్తూ భర్తను గట్టిగా కౌగిలించుకుంది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కావటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నై అయనవరం ఠాగూర్ నగర్లో జరిగింది.
ఠాగూర్ నగర్లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కరుణాకరన్(75), అతని భార్య పద్మావతి (66) నివాసముంటున్నారు. గత రాత్రి కరుణాకరన్ ఇంటికి బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు. తనకు ఇవ్వకుండా బిర్యానీ ఎందుకు తిన్నావని భార్య ప్రశ్నించింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాదన జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త కరుణాకరన్ పక్కనే కిరోసిన్ డబ్బాను తీసుకొని భార్యపై పోశాడు. ఆ వెంటనే నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న భార్య పద్మావతి కేకలు వేస్తూ భర్తను గట్టిగా పట్టుకుంది. ఇద్దరు మంటల్లో చిక్కుకొని కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు.
భార్యభర్త ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒక్క బిర్యానీకోసం గొడవపడి ఇద్దరు వృద్ధ దంపతులు ప్రాణాలమీదకు తెచ్చుకోవటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.