Dhanadhanyo Auditorium: శంఖు ఆకారంలో ధన ధాన్య ఆడిటోరియం.. నిర్మాణంకు ఎన్నేళ్లు పట్టిందో తెలుసా.. ఫొటోలు వైరల్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో శంఖు ఆకారంలో ఆధునిక హంగులతో ధన ధాన్య ఆడిటోరియంను ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆడిటోరియంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
Dhanadhanyo Auditorium: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో శంఖు ఆకారంలో ధన ధాన్య ఆడిటోరియంను ప్రభుత్వం నిర్మించింది. శంఖు ఆకారంలో చూపరులను ఈ ఆడిటోరియం కట్టిపడేస్తోంది. రూ. 440 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియంలో అనేక విభాగాలు ఉన్నాయి. అద్భుత కట్టడంగా పేర్కొంటున్న ఈ ధన ధాన్య ఆడిటోరియంను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక అద్భుతం మన రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు.
ఈ ఆడిటోరియం ప్రత్యేకత ఏమిటంటే.. శంఖం ఆకారంలో దీన్ని రూపొందించారు. దీని ఎత్తు దాదాపు 600 అడుగులు. రూ. 440 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియం పూర్తి చేయడానికి దాదాపు ఆరు వందల మంది కార్మికులు ఏడేళ్లు పనిచేశారు.
ఆడిటోరియం లోపల మినీ ఆడిటోరియం, బాంకెట్, స్ట్రీట్ కార్నర్ థియేటర్, ఫుడ్ కోర్టు, పార్కింగ్, మల్టీపర్సస్ హాల్ అందుబాటులో ఉన్నాయి. ఆడిటోరియం లోపలి భాగంలో జింక్ పూతతో కూడిన ఇనుప నిర్మాణం ఉంది. దీనిని జర్మనీ నుంచి సేకరించినట్లు వర్గాలు తెలిపాయి.
ఆడిటోరియం లోపల భాగంలో వేరువేరుగా రెండు ఆడిటోరియాలు నిర్మించారు. ఒకటి గరిష్ఠంగా రెండు వేల మంది కూర్చొనే విధంగా సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. మరొక దానిలో దాదాపు 450 మంది కూర్చొనేలా సీటింగ్ అమర్చారు. అంతేకాదు, 300 మందికి పైగా కూర్చొనే సామర్థ్యంతో ఓపెన్ థియేటర్ కూడా ఈ ధన ధాన్య ఆడిటోరియంలో ఉంది.
ఆడిటోరియం నిర్మించేందుకు గుజరాత్ లోని సూరత్ నుంచి ఖరీదైన రాళ్లను తెప్పించారు. ప్రధాన నిర్మాణాన్ని తయారు చేసేందుకు ఆరువేల మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు.