COBRA commander : మావోయిస్టుల చెర నుంచి కోబ్రా కమాండర్ రాకేశ్వర్ విడుదల
మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండర్ రాకేశ్వర్సింగ్ విడుదల అయ్యారు. బాసగూడ అడవుల సమీపంలో కమాండర్ను మావోయిస్టులు విడిచిపెట్టారు.
COBRA commander Rakeshwar Singh released : మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండర్ రాకేశ్వర్సింగ్ విడుదల అయ్యారు. బాసగూడ అడవుల సమీపంలో కమాండర్ను మావోయిస్టులు విడిచిపెట్టారు. రాకేశ్వర్ విడిచిపెట్టినట్లు అతని కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత శనివారం ఎదురు కాల్పుల తర్వాత.. మావోయిస్టులు కోబ్రా కమాండో రాకేశ్వర్ను బంధీగా తీసుకెళ్లారు.
అప్పటి నుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు విడిచి పెట్టారు. వందలాదది మంది గ్రామస్థుల సమక్షంలో జవాన్ ను విడుదల చేశారు. జవాన్ తో కలిసి మధ్యవర్తులు బాసగూడకు తిరిగి వస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించిన వారిలో ఏడుగురు జర్నలిస్టులు ఉన్నారు.
అంతకుముందు మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టారు. జవాన్ విడుదల బాధ్యతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్కు అప్పగించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్.. మావోయిస్టుల దాడిపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మావోలు రాకేశ్వర్ సింగ్ను విడుదల చేశారు. కాసేపట్లో బెటాలియన్ వద్దకు చేరుకోనున్నారు రాకేశ్వర్ సింగ్. ఏప్రిల్ 3వ తేదీన ఎన్ కౌంటర్ తర్వాత రాకేశ్వర్ సింగ్ మావోలకు చిక్కిన సంగతి తెలిసిందే.
ఛత్తీస్గడ్లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ జరగగా.. ఈ ఘటనలో 24 మంది జవాన్లు అమరులు అవ్వగా.. 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం జవాన్ల నుంచి మావోయిస్టులు ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా నాయకత్వంలో ఈ దాడి జరిగింది.