హైవే దగ్గర రోడ్డు పక్కన నగ్నంగా కాలేజీ విద్యార్థిని, యూపీలో మరో దారుణం

హైవే దగ్గర రోడ్డు పక్కన నగ్నంగా కాలేజీ విద్యార్థిని, యూపీలో మరో దారుణం

College student found half-burnt: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ యువతి 60 శాతం కాలిన గాయాలతో, రోడ్డు పక్కన నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో ఏం జరిగిందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలు కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలోని సుఖ్‌దేవానంద్ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతోంది.

సోమవారం(ఫిబ్రవరి 22,2021) తండ్రితో కలిసి యువతి కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత కూతురిని తీసుకురావడానికి తండ్రి కాలేజీకి వెళ్లాడు. కళాశాల ముగిసినా ఆమె బయటకు రాలేదు. దీంతో తండ్రి ఆందోళన చెందాడు. ఆమె కోసం వెతకులాట ప్రారంభించాడు. ఇంతలో పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. లక్నో-బరేలీ జాతీయ రహదారి పక్కన ఓ యువతి పడి ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 60 శాతం కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న యువతిని చూసి పోలీసులు షాక్ తిన్నారు. తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అందరిని విస్మయానికి గురి చేసింది. అసలేం జరిగిందో తెలీక ఆందోళన చెందుతున్నారు. విద్యార్థిని తండ్రి కూడా షాక్ లో ఉన్నాడు. తన కూతురికి ఏం జరిగింది, ఎలా జరిగింది? అనేది తనకు తెలియదన్నాడు. తన కూతురు తనకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదన్నాడు. కాగా, కూతురిని రోజూ తానే కాలేజీకి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తానని తెలిపాడు. మరోవైపు పోలీసులు బాధితురాలి క్లాస్ మేట్స్ ని, స్నేహితులను విచారించారు. కానీ ఎలాంటి క్లూ లభించలేదు. యువతి స్పృహలోకి వస్తే కానీ, అసలేం జరిగిందో చెప్పలేము అని షాజహాన్ పూర్ ఎస్పీ ఆనంద్ తెలిపారు.

షాజహాన్‌పూర్‌లోనే జరిగిన మరో ఘటనలో చెరువు దగ్గరికి వెళ్లిన ఐదేళ్ల బాలిక, ఆమెకు సోదరి వరుసయ్యే ఏడేళ్ల బాలిక అదృశ్యమయ్యారు. వారి కోసం వెతుకుతున్న సమయంలో ఐదేళ్ల బాలిక సమీపంలోని పొలంలో విగతజీవిగా కనిపించింది. మరో బాలిక తీవ్రంగా గాయపడి ఉంది. మరో ఘటనలో రాష్ట్రంలోని లిఖింపూర్‌లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు కాలేజీ విద్యార్థినులు అదృశ్యమయ్యారు.