రివాల్వర్ తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
Sub-inspector commits suicide in Bihar’s Aurangabad district బీహార్ లో ఓ సబ్ ఇన్స్పెక్టర్(SI) సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఔరంగాబాద్ జిల్లా అంబా పోలిస్స్టేషన్ సమీపంలోని తన నివాసంలో ఆదివారం(డిసెంబర్-20,2020)ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఔరంగాబాద్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్(SDPO)తెలిపిన వివరాల ప్రకారం…రోహతస్ జిల్లాకి చెందిన జితేంద్ర సింగ్(55)ఔరంగాబాద్ జిల్లాలోని అంబా పోలీస్స్టేషన్ లో SIగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే ఉన్న తన నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న సహచర పోలీసులు వెంటనే జితేంద్ర సింగ్ ని ఔరంగాబాద్ సదార్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారని తెలిపారు.
అయితే, జితేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదని,ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. జితేంద్ర సింగ్ కుటుంబసభ్యులకు ఘటనపై సమాచారం అందించామని తెలిపారు.