బంపర్ ఆఫర్ : మెట్రో రైలు ఛార్జీల్లో 50 శాతం రాయితీ
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. 2020, జనవరి 14వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు దుకాణ యజమానులు, ఇతర వ్యాపార సంస్థలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇదే దారిలో మెట్రో రైల్ చేరింది. ఏకంగా టికెట్ ఛార్జీల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. ఇది చదవగానే తెలంగాణ రాష్ట్రంలోనేనా అని ఎగిరి గంతేయ్యకండి.
తెలంగాణ రాష్ట్రంలో కాదు..పొరుగున ఉన్న చెన్నైలో. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులను ఆకట్టుకొనేందుకు ఆఫర్ ప్రకటిస్తున్నట్లు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) వెల్లడించింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం, గవర్నమెంట్ హాలీడేస్ ఉన్న రోజుల్లో టికెట్ ఛార్జీల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. పొంగల్ పండుగను పురస్కరించుకుని 2020, జనవరి 15, 16, 17వ తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో మూడు రోజులు 50 శాతం రాయతీతో ప్రయాణించవచ్చని వెల్లడించింది.
అంతేగాకుండా క్యాబ్ వసతి కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 17వ తేదీ చెన్నై మెరీనా బీచ్ నుంచి మెట్రో రైల్వే స్టేషన్లకు ప్రత్యేక క్యాబ్ వసతిని ఏర్పాటు చేసినట్లు, ప్రభుత్వ ఎస్టేట్, DMS మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి మెరీనా బీచ్కు క్యాబ్ వసతి కల్పించనున్నట్లు CMRL సంస్థ ప్రకటించింది.
Read More : రాజధాని ఆందోళనలు 27వ రోజు : పోలీసులకు సహాయ నిరాకరణ