ఓటు వేయటం ప్రతీ ఒక్కరి బాధ్యత : రాజ్ బబ్బర్
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు..ఫతేపుర్ సిక్రి అభ్యర్థి రాజ్ బబ్బర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజావల్లభ్ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్ లో రాజ్ బబ్బర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
కాగా లోక్ సభ రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ సినీ నటులు అజిత్, ఆయన భార్య షాలిని, మరో సినీ నటుడు విజయ్ కూడా ఓటు వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.