Rajeev Satav : కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత, విషాదంలో రాహుల్ గాంధీ
కరోనా మహమ్మారి మరో రాజకీయ ప్రముఖుడిని బలి తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ (46) ఆదివారం(మే 16,2021) ఉదయం కన్నుమూశారు. రాజీవ్ సాతవ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
Rajeev Satav : కరోనా మహమ్మారి మరో రాజకీయ ప్రముఖుడిని బలి తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ (46) ఆదివారం(మే 16,2021) ఉదయం కన్నుమూశారు. రాజీవ్ సాతవ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
కోవిడ్కు చికిత్స పొందుతూ ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 22న సాతవ్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత పుణెలోని జహంగీర్ ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. మే 9న నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్గా వచ్చినప్పటికీ.. కొవిడ్ సమయంలో తలెత్తిన అనారోగ్యం అలాగే కొనసాగడంతో సెకండరీ న్యుమోనియా వంటి సమస్యలు తలెత్తి అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్.. ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 1974 సెప్టెంబర్ 21న పుణెలో జన్మించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు నిర్వర్తించారు. 2014-2019 మధ్య హింగోలి లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ సహా పులువురు రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ‘‘పార్లమెంటులో నా సహచర మిత్రుడు రాజీవ్ మరణవార్త నన్ను ఆవేదనకు గురి చేసింది. రాజీవ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అత్యంత సామర్థ్యం గల నాయకుడు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ట్విటర్లో మోదీ విచారం వ్యక్తం చేశారు.