Congress Protest : 10 రోజుల పాటు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన!
ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
Congress Protest ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గురువారం వివిధ రాష్ట్రాల ఏఐసీసీ ఇంఛార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
బ్లాక్,జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విభాగాలు జులై 7-17వ తేదీల మధ్య అమలు చేస్తాయని కేసీ వేణుగోపాల్ తెలిపారు. బ్లాక్ స్థాయిల్లో మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఏఐసీసీ సంస్థలు ఆందోళనల్లో పాల్గొంటాయని, జిల్లా స్థాయిల్లో పార్టీ నేతలు సైకిల్ ర్యాలీలు చేపడతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ధర్నాలు చేపడతామన్నారు.
మే 2 నుంచి ప్రభుత్వం 29 సార్లు ఇంధన ధరలు పెంచిందని వేణుగోపాల్ తెలిపారు. 150కిపైగా నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. పెట్రోల్, డీజీల్ పై విధించిన ఎక్సైజ్ సుంకంతో బీజేపీ ప్రభుత్వం గడిచిన ఏడు సంవత్సరాల్లో రూ.22 లక్షల కోట్లు ఆర్జించింది. గడిచిన ఆరునెలల్లో వంట నునెల ధరలు దాదాపు రెండింతలయ్యాయని తెలిపారు. టోకు ద్రవ్యోల్బణం మే 2021లో 12.94శాతానికి చేరింది. ఇది 11 ఏళ్లలోనే అత్యధికం అని వేణుగోపాల్ తెలిపారు. కరోనా మహమ్మారి, నిరుద్యోగిత, జీతాల కోత వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వేణుగోపాల్ తెలిపారు.