Cooking Oil : డిసెంబర్ నుంచి వంట నూనె ధరలు తగ్గే అవకాశం!
డిసెంబర్ నెలలో వంటనూనె ధరలు తగ్గే అవకాశం ఉందని ఆహాకేంద్రర, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు.

Cooking Oil : దేశంలో వంటనూనె ధరలు మండిపడుతున్నాయి. కిలో నూనె రూ.150కి పైమాటే.. తాజగా తగ్గినా అది వినియోగదారులకు పెద్ద ఉపశమనమెని కలిగించలేదు. ఇక వంట నూనె పెరుగుదలకు కారణం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలే అని నిపుణులు చెబుతున్నారు. ఇక వంటనూనెలు అంశంపై తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుభవార్త చెప్పారు.
ఇప్పుడు సాగులో ఉన్న పంటలు చేతికి రానున్న నేపథ్యంలో అప్పటికల్లా అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. డిసెంబర్ నాటికి వంట నూనెల ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. ఇప్పటికే డిసెంబర్ ఫ్యూచర్ మార్కెట్లో వంట నూనెల రేట్లు తగ్గాయని తెలిపారు. అయితే, డిమాండ్ భారీ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో తగ్గింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని పేర్కొన్నారు..
ధరలు పెరుగుదలకు కారణం
దేశంలో వంటనూనె ధరలు ఈ విధంగా పెరగడానికి గల కారణాలను పాండే వివరించారు. నూనె గింజల సాగు అధికంగా ఉన్న దేశాల్లో బయోఫ్యూయల్ పాలసీలు తీసుకురావడంతో ధరలపై ఒత్తిడి పెరిగిందని తెలిపారు. మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పామాయిల్ సాగు అధికంగా చేస్తారు. ఇక్కడ దీనిని బయోఫ్యూయల్ గా వినియోగించాలని నిర్ణయించారు. దీంతో రేట్లు అమాంతం పెరిగాయి. భారత మార్కెట్లో పామాయిల్ వాటా 30 నుంచి 31 శాతం ఉంటుంది. ఎగుమతి చేసే దేశాల్లో వాటి ధరలు అమాంతం పెరగడంతో వాటిమీద ఆధారపడిన భారత్ లో కూడా వంటనూనెలు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది సామాన్యులపై అధిక ప్రభావం పడుతుంది.
ఇక సోయాబీన్ విషయానికి వస్తే.. సొయానూనె ఉత్పత్తిలో అమెరికా మొదటిస్థానంలో ఉంటుంది. అమెరికా సొయాను బయోఫ్యూయల్ తయారీలో వినియోగిస్తుంది. దీంతో దీని రేటు కూడా అమాంతం పెరిగింది. ఆ ప్రభావం భారత్ పై పడింది. భారత మార్కెట్లో సొయా మార్కెట్ వాటా 22 శాతం ఉంది. ఇక దేశంలో వంటలకు అవసరమైన 60 శాతం నూనెను విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో నూనె ధరలు పెరిగిన ప్రతి సారి దేశీయంగా ప్రభావం చూపుతుంది.
వంటనూనె ధరల పెరుగుదల
ఇక ప్రపంచ విపణిలో సోయాబీన్ నూనె ధర 18 శాతం, పామాయిల్ ధర 22 శాతం పెరిగితే.. భారత్లో మాత్రం ఈ పెరుగుదల 2 శాతానికే పరిమితమైందన్నారు. దిగుమతి సుంకాల్ని తగ్గించడం వంటి చర్యలతో సర్కార్ ధరల్ని నియంత్రించే ప్రయత్నం చేసిందన్నారు సుధాంశు పాండే. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గత ఏడాది కాలంలో కిలో పామాయిల్ ధర 64 శాతం పెరిగి రూ.139, సోయాబీన్ ధర 51.21 శాతం ఎగబాకి 155కి పెరిగింది. కిలో సన్ఫ్లవర్ నూనె ధర 46 శాతం పెరిగి 175కు చేరింది.