కరోనా ఎఫెక్ట్ : ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు 

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 06:57 PM IST
కరోనా ఎఫెక్ట్ : ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు 

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్ అధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు ) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని గురువారం (జూన్ 25, 2020) వెల్లడించింది.

కరోనా కట్టడికి మార్చిలో విధించిన లాక్ డౌన్ నిర్ణయంతో అన్ని రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని అప్పట్లో తెలిపింది. ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దును జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. 

దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ మరోసారి రెగ్యులర్ ప్యాసింజర్ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్ డౌన్ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరికొన్ని రైళ్లు మాత్రం యథాతథంగా నడవనున్నాయి.