కరోనా ఉగ్రరూపం : మళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాల చూపు

  • Published By: madhu ,Published On : July 14, 2020 / 07:33 AM IST
కరోనా ఉగ్రరూపం : మళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాల చూపు

ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు భారతదేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉపాధి కోల్పోయి..ఎంతో మంది రోడ్డున పడ్డారు. చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో కేంద్రం లాక్ డౌన్ లో కొన్నింటిని సడలింపులు ఇచ్చింది. ఈ క్రమంలో..కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు అమాంతం పెరిగాయి. లాక్ డౌన్ మరోసారి విధించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

దీంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు చూస్తున్నయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాయి. బెంగళూరులో 2020, జులై 14వ తేదీ మంగళవారం నుంచి 7 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తామని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ధార్వాడ్, దక్షిణ కన్నడ జిల్లాల్లోనూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ధార్వాడ్ లో 2020, జులై 15వ తేదీ బుధవారం నుంచి 9 రోజులు, దక్షిణ కన్నడ జిల్లాలో 7 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుంది.

ఇక జమ్మూకశ్మీర్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శ్రీనగర్‌లోనే 88 కంటైన్మెంట్‌ ప్రాంతాలను గుర్తించారు. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలను మూసివేశారు. మాస్కు ధరించకపోతే రూ. 1000, కంటైన్మెంట్‌ జోన్లలో భౌతిక దూరం పాటించాలని, లేకపోతే రూ. 10వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. మొత్తానికి కరోనా ఉగ్రరూపం దాలుస్తుండడంతో లాక్ డౌన్ విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.